ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టించింది. వైసీపీ తిరుగులేని విజయానికి జగన్ చేసిన పాదయాత్ర, తెర వెనుక ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యూహాలు ప్రధాన కారణమయ్యాయి. పాదయాత్ర సమయంలో జగన్ అడుగడుగులో ఉన్న ఐప్యాక్ టీమ్ ఎప్పటికప్పడు ఆయనకు అదిరిపోయే సలహాలు, సూచనలు ఇచ్చింది. అందులో ప్రధానమైంది.. సెల్ఫీ విత్ జగన్ స్ట్రాటజీ. నిత్యం అడిగిన ప్రతి ఒక్కరికి సెల్ఫీ ఇవ్వడంతో పగిలిపోయే పబ్లిసిటీ వచ్చింది.
నిత్యం పాదయాత్ర చేస్తూ జగన్ అందర్నీ ఆత్మీయంగా పలకరించడం, వారితో సన్నిహితంగా మాట్లాడటంతోపాటు.. అడిగిన వారందరికీ జగన్ సెల్ఫీలు ఇస్తూ ముందుకు సాగారు. ఓ కీలక నాయకుడు తనను కలిసి మాట్లాడితే.. ఎవరికైనా ఆ నాయకుడి పట్ల సానుకూల దృక్పథం అలవడుతుంది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సెల్ఫీ స్ట్రాటజీని ప్రవేశపెట్టారు.
పాదయాత్ర చేస్తున్న సమయంలో అడిగిన ప్రతి ఒక్కరితో కాదనకుండా సెల్ఫీలు దిగారు. రోజుకు వెయ్యికి పైగా సెల్ఫీలు ఇస్తూ వెళ్లారంటేనే ఏ రేంజ్లో పబ్లిసిటీ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఆయనతో కలిసి సెల్ఫీ, ఫోటోలు దిగిన వారు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుటుంబ సభ్యులతోపాటు బంధువులకు, ఆత్మీయులకు, స్నేహితులకు పంపించుకున్నారు. దీంతో అవి మరింత మందికి చేరాయి. దీని వల్ల జగన్ పట్ల జనాల్లో పాజిటివ్ టాక్ విపరీతంగా పెరిగింది. ఇదే క్రమంలో జగన్ ఇచ్చే హామీలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అవీ కూడా ఈ సెల్ఫీలతో పాటే మరింతా ప్రచారమయ్యాయి.
పాదయాత్ర సమయంలో జగన్తో సెల్ఫీలు తిగడం జనాలకు ఫ్యాషన్గా మారితే, అదే వైసీపీకి తిరుగులేని ప్రచారాన్ని తీసుకోచ్చాయనడంలో సందేహం లేదు.