రామ్ విలాస్ పాశ్వాన్....బిహార్‌లో రాజకీయ చాణక్యుడు. జనతాదళ్ నుంచి వేరుపడి...సొంత పార్టీ లోక్ జనశక్తిని ఏర్పాటుచేసి.. రాజకీయ శక్తిగా మార్చారు. 1989 నుంచి.. 2019 వరకు.. 30 ఏళ్లలో.. ప్రధానులు ఎందరు మారినా.. ఆయన దాదాపుగా ప్రతి కేబినెట్ లోనూ మంత్రి అయ్యారు. ఆరుగురు ప్రధానుల నాయ‌క‌త్వంలో పనిచేసి సంచ‌ల‌న రికార్డు సృష్టించారు. వీపీ సింగ్, హెచ్ డీ దేవెగౌడ్, ఐకే గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్ పేయి, మన్మోహన్ సింగ్, నరేంద్రమోడీ .. ఆరుగురు ప్రధానమంత్రుల మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఘనతను రామ్ విలాస్ పాశ్వాన్ సొంతం చేసుకున్నారు.


రామ్ విలాస్ పాశ్వాన్ సొంత రాష్ట్రం బిహార్‌. 1969లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ నుంచి తొలిసారి.. అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజ్ నారాయణ, జయప్రకాశ్ నారాయణ్‌ల ప్రభావంతో.. ఆయన లోక్ దళ్ పార్టీ జనరల్ సెక్రటరీ అయ్యారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. తర్వాత జనతాపార్టీలో స‌భ్యుడ‌య్యారు. ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికల్లో హాజీపూర్ నియోజకవర్గం నుంచి  జనతా పార్టీ టికెట్‌పై బ‌రిలో దిగి రికార్డు స్థాయిలో 4లక్షల పైచిలుకు ఓట్లతో గెలుపొంది.. దేశవ్యాప్తంగా పాశ్వాన్ గుర్తింపు పొందారు. 1989లో వీపీ సింగ్ కేబినెట్ లో తొలిసారి కేంద్రమంత్రి అయ్యారు. కార్మిక మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత.. HD దేవెగౌడ, IK గుజ్రాల్ ప్రభుత్వాల్లో… ఆయనకు రైల్వే శాఖ మంత్రి బెర్త్ దక్కింది. పదేళ్ల కాలంలోనే ఆయన ముగ్గురు ప్రధానుల కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్ప‌టి నుంచి మంత్రి ప‌ద‌వులు పొందుతూనే ఉన్నారు. 


1999లో అట్ల బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలోనూ సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి పోస్ట్ దక్కించుకున్నారు పాశ్వాన్. 2002లో అదే ప్రభుత్వంలో బొగ్గు గనుల మంత్రిగానూ పనిచేశారు. 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత ఆయన NDAకు మద్దతు ఉపసంహరించారు. యూపీఏకు మద్దతిచ్చారు. 2004 లోక్ సభ ఎన్నికల తర్వాత ఏర్పాటైన యూపీఏ ప్రభుత్వంలో చేరారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో.. 2009 వరకు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి హోదాలో సేవలందించారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు పాశ్వాన్. 2010 నుంచి 2014 మధ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు.. బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. ఎన్డీయేకు దూరమైన జేడీయూ నేత, అప్పటి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఎదుర్కొనేందుకు… లోక్ జనశక్తి, బీజేపీ చేతులు కలిపింది. పాశ్వాన్ ఆధ్వర్యంలోని లోక్ జనశక్తికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతోపాటు.. 7 సీట్లు ఇచ్చింది బీజేపీ. అందులో ఆరింటిని ఎల్జేపీ గెలుపొందింది. హాజీపూర్ నుంచి పాశ్వాన్ తోపాటు.. అతడి కొడుకు చిరాగ్ పాశ్వాన్, సోదరుడు రామ్ చంద్ర పాశ్వాన్ కూడా ఎంపీలుగా గెలుపొందారు. మ‌ళ్లీ మంత్రి అయ్యారు పాశ్వాన్‌. తాజాగా కూడా ఆయ‌న తిరిగి మంత్రి ప‌ద‌వి సొంతం చేసుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: