జగన్ క్యాబినెట్ కూర్పు ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కొంత మంది ముఖ్య నేతలకు మంత్రి పదవులు వస్తాయని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ వారికీ మంత్రి పదవులు ఇవ్వలేదు. ముఖ్యంగా వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ రోజా - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు... సీనియర్ లీడర్ ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మరో కీలక నేత - జగన్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైన భూమన కరుణాకర రెడ్డికి సైతం చోటు దక్కలేదు.


దాదాపుగా ప్రతి జిల్లాలో ఇలాంటి నేతలు కనిపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పేరు కూడా జాబితాలో కనిపించలేదు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కు మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ధర్మాన ప్రసాదరావు అనుచరులు ఏంటీ పరిస్థితి అని టెన్షన్ పడుతున్నారు.అలాగే గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేశ్ పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా మంత్రి పదవి దక్కలేదు.


అదే జిల్లాలో మర్రి రాజశేఖర్ కు గతంలో జగన్ నుంచి హామీ దొరికినా ఇప్పుడు చాన్సు దొరకలేదు. చిలకలూరిపేట నుంచి విడదల రజనీకి టికెట్ కేటాయించడంతో మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని రోడ్ షోలో ప్రజల ముందు బహిరంగంగా చెప్పిన జగన్ ఇప్పుడు హామీని నిలుపుకోలేదని మర్రి అభిమానులు అంటున్నారు. అలాగే సత్తెనపల్లి ఎమ్మెల్యే.. పార్టీకి బలమైన గొంతుక అయిన అంబటి రాంబాబుకు కూడా నిరాశ తప్పలేదు.కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్లు శ్రీనివాసులు - రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికీ ఆశాభంగం తప్పలేదు. కర్నూలు జిల్లాలో శిల్పా కుటుంబానికి మంత్రి పదవి రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: