మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.  ఐఆర్‌ఎస్‌ అధికారిగా పనిచేసిన రావెల కిశోర్ బాబు 2014 ఎన్నికలకు ముందు ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేసి తెదేపాలో చేరారు. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన చంద్రబాబు హయాంలో కొన్నాళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. మంత్రి పదవి కోల్పోవడంతో తెదేపాకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. 2018లో తెదేపాకు రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇటీవల ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి ఆయన జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం జనసేనకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు పవన్‌కు లేఖ పంపారు. రావెల భాజపాలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: