తెలుగుదేశం పార్టీ నుంచి నేతల వలస కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీలో పలువురు నేతలు పార్టీ మారే దారిలో ఉండగా...తెలంగాణలోనూ అదే ట్రెండ్ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేని విధంగా తెలంగాణలో పోటీ చేయని పరిస్థితి ఎదురైంది. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కటంటే..ఒక్క చోట కూడా ఆ పార్టీ పోటీ చేయలేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే టీడీపీని పట్టించుకున్న వారేలేరు. ఇలాంటి దుస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్య నేతలు తమ దారి తాము చూసుకుంటున్న సంగతి తెలిసిందే. అలా పార్టీలో నంబర్ `టూ`గా ఓ వెలుగువెలిగిన నేత గుడ్బై చెప్పేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు గెల్చుకున్న ఊపులో ఉన్న ఆ పార్టీ.. ఇతర పార్టీల్లోని ప్రముఖ లీడర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది.లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి డీకే అరుణ, టీఆర్ఎస్ నుంచి జితేందర్ రెడ్డిలాంటి నేతల్ని చేర్చుకున్నట్టే.. మరికొందరిని తిప్పుకునే ప్రయత్నంలో ఉంది. తెలంగాణలో నామమాత్రంగా మిగిలిన టీడీపీ నుంచి బలమైన లీడర్లపైనా కన్నేసింది. ఇటీవలే టీడీపీ నేత పెద్దిరెడ్డి, చాడ సురేశ్రెడ్డి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. టీడీపీలో ఒకప్పుడు నంబర్ టూగా ఉన్న దేవేందర్గౌడ్ను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనతోపాటు ముగ్గురు నలుగురు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీతో టచ్లో ఉన్నట్టు సమాచారం.
తెలంగాణలో ఇక కోలుకునే పరిస్థితి లేకపోవడం...ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో టీడీపీ పూర్తిగా డీలా పడిపోవడంతో ఆ పార్టీ లీడర్లు చాలామందితో బీజేపీ టచ్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీలోనే ఆ పరిస్థితి ఉంటే ఇంక తెలంగాణలో తమకు ఎక్కడ భవిష్యత్తు ఉంటుందని టీడీపీ లీడర్లు బీజేపీ వైపే చూస్తున్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతల సూచనలతో పలువురు నేతలు రంగంలోకి దిగి చర్చలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.