తొందరలో జగన్మోహన్ రెడ్డి
ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరిగేషన్
ప్రజాక్టులపై కమీషన్ ద్వారా విచారణ చేయంచాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ఓ పది
రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యేట్లు సమాచారం.
చంద్రబాబునాయుడు హయాంలో చాలా ప్రాజెక్టులు చేపట్టారు. వాటి నిర్మాణాల్లో విపరీతమైన అవనీతి చోటు చేసుకున్నట్లు చాలా ఆరోపణలే ఉన్నాయి. పోలవరం, పట్టిసీమ నుండి గాలేరు-నగిరి, హంద్రీ-నీవా లాంటి చాలా ప్రాజెక్టుల నిర్మాణాలను వాటి అసలు అంచనాలకన్నా పది రెట్లు పెంచేశారని చంద్రబాబుపై అనేక ఆరోపణలున్నాయి.
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ప్రధానంగా రాయలసీమలోని ప్రాజెక్టుల్లో ఎక్కువభాగం టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేషే చేస్తున్నారు. కేవలం డబ్బు సంపాదన కోసమే ప్రాజెక్టుల అసలు అంచనాలను ఒకటికి పదిరెట్లు పెంచేసి రమేష్ బిల్లులు తీసుకున్నట్లు అనేక ఆరోపణలున్నాయి. ఆరోపణలపై ఆమధ్య రాయలసీమకు చెందిన బిజెపి నేతలు నిజనిర్ధారణ కమిటి పేరుతో తిరిగి వివరాలు సేకరించారు. తర్వాత కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదులు కూడా చేశారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి జగన్ అనేక శాఖలతో సమీక్షలు చేశారు. అందులో ఇరిగేషన్ శాఖపై రెండుసార్లు సమీక్షలు జరిపారు. పెంచేసిన అంచనాలు, కాంట్రాక్టర్లపై ఆరోపణలు తదితరాలపై అధికారుల ద్వారానే ఓ నివేదిక తయారు చేయిచారట. ప్రతిపక్షంలో ఉన్నపుడే ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతిపై తనకున్న ఫీడ్ బ్యాక్ ను పోల్చి చూసుకున్నారని సమాచారం.
రెండు రకాలుగా వివరాలు తెప్పించుకున్న జగన్ ప్రాజెక్టుల అవినీతి ఆరోపణలపై ఓ కమీషన్ నియమించి విచారణ చేయించాలని డిసైడ్ అయ్యారట. ఓ పది రోజుల్లో దీనికి సంబంధించిన ఆర్డర్లు రావచ్చని సమాచారం. అదేగనుక జరిగితే చంద్రబాబుతో పాటు చాలామంది టిడిపి పెద్ద తలకాయల బండారం బయటపడటం ఖాయమనే అనిపిస్తోంది.