ఆ ప్రజాప్రతినిధి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తనపై రేప్ కేసు పెట్టిన మహిళనే చివరకు పెళ్లాడాడు. త్రిపుర రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ధనంజోయ్ సంచలన నిర్ణయం రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. త్రిపురలోని అధికార ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) ఎమ్మెల్యే ధనంజోయ్. దలాయికి చెందిన ఓ మహిళ ఎమ్మెల్యే ధనంజోయ్పై తనను రేప్ చేశాడని గత నెల 20న న అగర్తలలోని మహిళా పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు పెట్టింది.
ఎమ్మెల్యే తనను శారీరకంగా లొంగదీసుకుని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. తమ ఇద్దరి మధ్యా చాలా రోజుల నుంచే సన్నిహిత సంబంధం ఉందని కూడా తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముందస్తు బెయిలు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఈ వివాదం రాజకీయంగా చినికి చినికి గాలివానలా మారింది. దీంతో మరోమార్గం లేక ఆదివారం తనపై కేసు పెట్టిన మహిళను వివాహం చేసుకున్నారు. అగర్తలాలోని చతుర్దాస్ దేవతా ఆలయంలో వీరి వివాహం జరిగింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తరపు న్యాయవాది తెలిపారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు హాజరైనట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కొత్త దంపతులు ఇద్దరూ భవిష్యత్తులో కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చారు.
ఎమ్మెల్యేపై రేప్ కేసుతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పెద్ద రగడే జరిగింది. అయితే చివరకు ఎమ్మెల్యే ధనుంజోయ్ ఆ మహిళనే పెళ్లాడడంతో విమర్శకుల నోళ్లకు తాళం పడింది.