కార్పొరేట్ కాలేజీల్లో సుపరిచితమైన నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలపై ఊహించని వివాదం మొదలైంది. తప్పుడు ర్యాంకులు ప్రకటించుకున్నారని పేర్కొంటూటూ...వీటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డీజీపీని కలిసి పిర్యాదు చేశాయి. నారాయణ, శ్రీ చైతన్య, ఆకాష్ కార్పొరేట్ విద్యా సంస్థలు తాజాగా ఐఐటీ, నీట్ లలో తప్పుడు ర్యాంకు లు ప్రకటించుకొని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని.. వారు పిర్యాదులో పేర్కొన్నారు. తక్షణం ఆయా విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పీడీఏయూ, పివైఎల్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, శ్రీచైతన్య, నారాయణ, ఆకాష్ అకాడమీ లు నీట్ ర్యాంకులను తప్పుగా ప్రకటించుకొని మోసాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తప్పుడు ర్యాంకులతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలలో విద్య సంస్థలు ఒకరికొకరు పోటీ పడి మొదటి ర్యాంకులు మావే అని మోసపూరిత ప్రకటనలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. నీట్ ర్యాంకులు సాధించిన భవిక్ బన్సల్, అక్షత్ కౌశిక్ పేర్లు, ఫోటోలతో సహా శ్రీచైతన్య, నారాయణ అకాడమీలు ప్రకటించుకున్నాయని ఆరోపించారు. ర్యాంకులు సాధించిన ఆ విద్యార్థులు ఏ అకాడమీ లో చదివారు... ఒక విద్యార్థి రెండు అకాడమీ లో చదవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు.
తప్పుడు ర్యాంకులతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో...పోలీసులు తగు విచారణ చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ఫిర్యాదులో ఆయా సంస్థల మోసం నిజమైతే...విద్యాసంస్థలపై తగిన చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు. అదే జరిగితే మొదటి దెబ్బ...ఏపీ మాజీ మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థలపైనే ఉంటుందని చెప్తున్నారు.