రాష్ట్రంలో అన్ని పాఠశాలలు జూన్ 12 నుంచి పున:ప్రారంభం కానున్నాయి. 2019-20 విద్యా క్యాలండర్ ప్రకారం విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ 12 వరకు సెలవులు పెంచారు. మరొ రెండు రోజుల పాటు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించారు.అటు పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ఇప్పటికే స్కూళ్లకు చేర్చింది. వీటితో పాటు ఉచితంగా అందజేయనున్న రెండు జతల యూనిఫారాలు కూడా స్కూళ్లకు పంపిణీ చేశారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి మధ్యాహ్న భోజనం కూడా అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
రాష్ట్రంలో జూన్ 4 నుంచి ప్రారంభం కావాల్సిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం 14వ తేదీకి వాయిదా పడింది. జూన్ 14 నుంచి 19వ తేదీ వరకు బడిబాట నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బడులను జూన్ 12కు వాయిదా వేసిన నేపథ్యంలోనే బడిబాట కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు.ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతి పాఠశాలకు రూ. 1,000 చొప్పున నిధులను ఇచ్చేలా జిల్లాల అధికారులకు పాఠశాల విద్య
కమిషనర్ విజయ్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రధాన లక్ష్యాలతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. జూన్ 1 నుంచి 3 వరకు సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించాలని, కలెక్టర్ల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహించి బడిబాట విజయవంతానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
ప్రజాప్రతినిధులను, స్వయం సహాయక బృందాల మహిళలను భాగస్వాములను చేసేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు సమావేశం నిర్వహించి 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్ల పంపిణీ, పాఠశాలల్లో అమలు చేస్తున్న ఇతర కార్యక్రమాలను వివరించేలా పాఠశాల ప్రొఫైల్ రూపొందించుకొని బడిబాటలో వివరించాలన్నారు.
ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, సహాయక కార్మిక అధికారి, స్వచ్ఛంద సంస్థలు, బాలికా శిశు సంక్షేమ పర్యవేక్షకులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, బాలకార్మికులు లేకుండా ఈ కమిటీలు చూడాలని స్పష్టం చేశారు.
విద్యార్థుల హక్కులకు సంబంధించిన సమస్యలను తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో, నోటీసు బోర్డులో టోల్ ఫ్రీ నంబర్ 18004253525 పొందుపరచాలని వివరించారు. పదవీవిరమణ పొందిన ఉపాధ్యాయులు/లెక్చరర్లు/ప్రొఫెసర్లు/ఉద్యోగులను బడిబాట చివరి రోజున ఆహ్వానించి వారికి పాఠశాలల అవసరాలను తెలియజెప్పి వారి సేవలను పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.