సింహం సింగిల్గా వస్తుంది అన్న డైలాగ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కరెక్టుగా సరిపోతుంది. మాటమాటకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు 15 ఏళ్లలో చేయలేని పనులు కూడా జగన్ 10 రోజుల్లో చేసి చూపిస్తున్నాడు. అంతెందుకు తొలిసారి చంద్రబాబు సీఎంగా గెలిచిన ప్రతిసారి ఆయన ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే అధికారంలోకి వచ్చారే తప్ప సొంతంగా పోటీచేసి గెలిచింది లేదు... ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తే ఆయన పార్టీ పరిస్థితి ఏంటో అందరూ చూశారు. రెండు ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ చేసిన జగన్ ఓసారి 67 సీట్లు గెలుచుకుని బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. రెండో సారి ఏకంగా 87 శాతం సీట్లు సాధించి రికార్డు నెలకొల్పారు.
ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తున్న జగన్ తాజాగా ఆర్టీసీ సమ్మె విరమింపజేసిన తీరుకు కార్మిక సంఘాలతో పాటు రాష్ట్ర ప్రజలు ఫిదా అవుతున్నారు. కేవలం ఒక్కటంటే ఒక్క మాటతో జగన్ ఆర్టీసీ సమ్మెకు బ్రేక్ వేశారు. టిడిపి అధినేత చంద్రబాబు సీఎంగా ఉండగానే ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే తాము సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. అయితే అప్పటికే ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఆ విషయాన్ని చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదు... సరికదా కార్మికుల డిమాండ్లను లైట్ తీసుకోవడంతో వారంతా చంద్రబాబు వైఖరితో విసిగిపోయిన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ఈ క్రమంలోనే ఈ నెల 13 నుంచి తాము సమ్మె బాటలోకి వెళుతున్నామన్న ప్రకటనను కార్మిక సంఘాలు మరోసారి వెల్లడించాయి. ఇక ఇప్పటికే కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నట్లు నోటీసు ఇవ్వడంతో.. ఆ నోటీసు సీఎం జగన్ దృష్టికి చేరింది. ఇక జగన్ పాదయాత్రలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను ఇచ్చిన హామీకి కట్టుబడి తొలి కేబినెట్ భేటీలో జగన్ ఆర్టీసిని ప్రభుత్వంలో కలిపేందుకు సూత్రాభిప్రాయంగా ఆమోదం కూడా తెలిపారు. ఇక తాము ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నందుకు ఆర్టీసీ కార్మికుల ఆనందానికి అవధులు లేవు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే క్రమంలో జగన్ ఓ కమిటీని కూడా వేశారు.
ఈ కమిటీ ఎంత త్వరగా, ఎంత సులువుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలో అధ్యయనం చేసి సీఎంకు నివేదిక ఇస్తుంది. ఈ కమిటీ త్వరలోనే తన పని ప్రారంభించనుంది. విచిత్రం ఏంటంటే రేపు సమ్మెకు రెడీ అవుతోన్న ఆర్టీసీ కార్మికులు ఈ రోజు జగన్ను కలవగా ఒక్క మాటతో వారు సమ్మె విరమించుకునేలా చేశారు. ఆర్టీసీ బాధ్యతను తాను పూర్తిగా తీసుకుంటున్నాను.. మీకు నేను ఉన్నాను అని జగన్ వాళ్లకు అభయం ఇవ్వగానే వాళ్లు సమ్మె సైరన్ ఆపేశారు. జగన్ చెప్పిన ఈ ఒక్క మాటతోనే కార్మిక సంఘాల నేతల ఆనందానికి అవధులు లేవు.