గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొత్తం 175 స్థానాల్లో కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తనకంటే వయసులో చాలా చిన్నవారైనా జగన్ చేతిలో ఘోరపరాజయం మూట కట్టుకున్నారు. 70 ఏళ్ల పైబడిన వయసులో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చంద్రబాబు ప్రవర్తన ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కానీ చంద్రబాబు రాజకీయ అనుభవం ఉపయోగించి సభలో అధికార పక్షాన్ని గట్టిగానే ఎదుర్కొన్నారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆయన వాయిస్ తగ్గిపోయింది అంటూ వైసీపీ నేతలు వెటకారం ఆడారు.
అందుకు దీటుగానే బదులిచ్చిన చంద్ర బాబు.. మైక్ వాయిస్ తగ్గిందంటూ చురకలు వేశారు. తన వాయిస్ లో ఎలాంటి మార్పు లేదని వైసీపీ నేతల నోళ్లు మూయించారు. తమ హయాంలో సభను బాగానే నటించమంటూ సమర్థించుకున్నారు.
చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు పయ్యావుల కేశవ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటివారు కూడా అధికార పక్షాన్ని దీటుగానే ఎదుర్కొన్నారు. స్పీకర్ ఎన్నిక విషయంలో తమను సంప్రదించ నందుకు నిరసనగా చంద్రబాబు తమ్మినేని సీతారాం బాధ్యతల స్వీకరణ సమయంలో దూరం పాటించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ప్రజల కోసమే తమ పార్టీ పోరాడుతుందని చెప్పడం ద్వారా చంద్రబాబు భవిష్యత్ పోరాటానికి సంకేతాలు ఇచ్చారు.