ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు సీఎం బాధ్యతలు స్వీకరించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు దివంగత ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాష్ట్రం సుభీక్షంగా ముందు సాగాలంటే..రైతులు బాగుండాలి. రాష్ట్రం ఇతర రంగాల్లో అభివృద్ది సాధించాలంటే..మంచి విద్యావంతులై ఉండాలి. అందుకే ఆయన ఎంతో మంది పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఫీజ్ రియాంబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాంతో ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు ఇతర రంగాల్లో ఉన్నత చదువులు చదివి తమ కాళ్లపై తాము నిలబడ్డారు.
విద్య గురించి తెలిసిన ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వేనోళ్లతో పొగిడారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుడు గా అన్ని విషయాల్లో ప్రజలకు ఉపయోగపడే ప్రతిపాదనలు తీసుకు వస్తున్నారు. తాడేపల్లి మండలంలోని పెనుమాక జెడ్పీ పాఠశాలలో ఈరోజు చేపట్టిన ‘రాజన్న బడిబాట కార్యక్రమంలో’ ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులను ఆశీర్వదించిన జగన్ ఓ బాలుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చిన్నారులతో కలిసి గడపడం, వాళ్లు బాగా చదువుకోవడం తన మనసుకు నచ్చిన విషయమని తెలిపారు. తన మనసుకు నచ్చిన పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘పిల్లలు బడికి పోవాలి. బడుల నుంచి కాలేజీకి పోవాలి. అక్కడి నుంచి వాళ్లు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్ల వంటి పెద్దపెద్ద చదువులు చదవాలి. ఈ చదువుల కోసం ఏ తల్లీతండ్రి అప్పులపాలు కాకూడదు అన్నదే నా ఆశ అన్నారు.