రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా సాగుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత విజయవాడలో ఫ్లైటెక్కిన జగన్... ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కేవలం 15 నిమిషాలు మాత్రమే సాగిన ఈ భేటీలో జగన్.... ఏపీకి ప్రత్యేక హోదా విభజన సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారించారు. విభజన చట్టంలోని అంశాల మేరకు తెలంగాణతో నెలకొన్న విభేదాలను పరిష్కరించడంతో పాటుగా 910 షెడ్యూల్ సంస్థల విభజన కూడా త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని అమిత్ షాను జగన్ కోరారు.


ఇక ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే విషయంలో కీలక భూమిక హోం శాఖ మంత్రిదేనన్న విషయాన్ని ప్రస్తావించిన జగన్... ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయంలో ప్రధాని మోదీని మెత్తబరిచే బాధ్యత కూడా మీదేనంటూ అమిత్ షాకు సూచించారు. ఆర్థిక ఇబ్బందుల్లోని ఏపీని ఒడ్డుకు చేర్చాలంటే... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేన్న విషయాన్ని కాస్తంత గట్టిగానే చెప్పిన జగన్... ఏపీ తరఫున అమిత్ షానే చొరవ తీసుకోవాలని కూడా కోరారు. జగన్ చెప్పిన విషయాలన్నీ ఓపిగ్గానే విన్న షా... సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే... రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన జగరనున్న నీతి ఆయోగ్ భేటీలోనూ జగన్ పాల్గొంటారు.


ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిన ఆవశ్యకతపై జగన్ ఈ సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ మేరకు అక్కడ ప్రస్తావించాల్సిన అంశాలు వినిపించాల్సిన వాదనలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. అమిత్ షాతో బేటీ ముగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్... ఆ భేటీ వివరాలను వెల్లడించడంతో పాటుగా రేపటి నీతి ఆయోగ్ సమావేశంలో తాము అనుసరించనున్న వ్యూహాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ప్రకటించాలన్న విషయంపై సమగ్ర వాదన వినిపిస్తామని ప్రధానిని ఒప్పించే దిశగానే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నామని జగన్ చెప్పారు.


ఇక ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా. ప్రధానిని ఎప్పుడు కలిసినా....కేంద్రంతో ఎప్పుడు బేటీ జరిగినా... ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ను వినిపిస్తూనే ఉంటామని జగన్ చెప్పారు. ఇదిలా ఉంటే... లోక్ సభలో వైసీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుందన్న వార్తలపై మీడియా సంధించిన ప్రశ్నలను జగన్ కొట్టిపారేశారు. తమకు ఆ పదవి ఇస్తామని ఎన్డీఏ చెప్పలేదని తాము కూడా ఆ పదవిని తమకు ఇవ్వాలని అడగలేదని కూడా జగన్ తేల్చి పారేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: