కొత్త పంచాయతీ చట్టం అమల్లోకి వచ్చినప్పటికి సర్పంచులకు ఎలాంటి నిధులు లేకపోవటంతో…రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు కొనసాగాయి. పదవిలోకి వచ్చినా…పంచాయతీ పనులు చేయలేక ఖాళీగా కూర్చున్నారు సర్పంచ్ లు. కొంత మంది సర్పంచ్ లు అయితే… చెక్ పవర్ ఇవ్వాలని భిక్షాటన కూడా చేశారు. కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో పంచాయతీలు ఉన్నాయని సర్కార్ తీరుపై మండిపడ్డారు. దీంతో అన్ని విధాలుగా సర్కార్ పై ఒత్తిడి పెరగటంతో.. ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం సర్పంచ్, ఉపసర్పంచులకు సంయుక్తంగా చెక్ పవర్ కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త పంచాయతీ చట్టం మార్చి 29న అసెంబ్లీ ఆమోదం పొందగా… అదే ఏడాది ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వచ్చింది.
ఇదిలాఉండగా, రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లకు రిసోర్స్ పర్సన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శిక్షణ ఇచ్చారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా అమలులోకి వచ్చిన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు నిధుల వినియోగం, విధుల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత తదితర అంశాలపై శిక్షకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచ్లకు రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సైతం చెక్ పవర్ అంశం చర్చకు వచ్చింది.