మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో పరాజయం పొందడం ఇదే తొలిసారి. ఓ వైపు చంద్రబాబుకు వయసు మీద పడటం, మరోవైపు లోకేష్ నాయకుడిగా నిరూపించుకోక పోవడం వల్ల దేశం పార్టీ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.
ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే తెలుగుదేశం పార్టీని ఆదుకుంటారు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదని సినీ రచయిత పోసాని కృష్ణ మురళి అన్నారు. సినిమా నటుల ను చూసి జనం ఓట్లు వేసే రోజులు పోయాయి అన్నారు.
జగన్ ప్రభుత్వం పూర్తి అవినీతిమయంగా మారినా.. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలించినా.. జూనియర్ ఎన్టీఆర్ కు అవకాశం ఉంటుందని పోసాని కృష్ణమురళి కామెంట్ చేశారు. కానీ జగన్ అలాంటి అవకాశం ఎవరికీ ఎప్పటికీ ఇవ్వడని తాను నమ్ముతున్నట్లు పోసాని అన్నారు. ఎవరు, ఎప్పుడు, ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారో కనిపెట్టలేనంత అమాయకంగా ప్రజలు లేరని పోసాని అంటున్నారు.
పోసాని కృష్ణమురళి మాటల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కు కూడా రాజకీయాల్లో అంత సీను ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ఇప్పుడప్పుడే రాజకీయాల వైపు వచ్చే అవకాశం కనిపించడం లేదు. కానీ ఓ పదేళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి చెప్పడం కష్టమే కదా.