రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే! - అన్నట్టుగా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో ఛీ కొట్టిన నోటితోనే ఇప్పు డు స్వాగత సత్కారాలు చేస్తున్నారు. అప్పట్లో తిట్టిపోసిన నాయకుడు, రాళ్లతో కొట్టించిన నాయకుడు జగన్ను ఇప్పుడు ఆప్యాయంగా కావలించుకుంటున్నారు! మరి దీనివెనుక రీజన్ లేదా? ఉందా? ఊరకరారు మహానుభావులు అన్న విధంగా .. కేసీఆర్ కూడా రాజకీయ వ్యూహాలు లేకుండా ఏపీ సీఎంతో చెలిమి చేస్తారా? ఏమీ లేకుండానే హైదరాబాద్ టు అమరావతి యాత్రలు సాగిస్తారా? ఇప్పుడు ఈ ప్రశ్నే మేధావులను సైతం తొలిచేస్తోంది.
ఈ క్రమంలో ఒక్కసారి గతంలోకి వెళ్దాం.. గతంలో జగన్ ఓదార్పు యాత్రలు చేసిన సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పా టుకు మద్దతివ్వని నువ్వు.. మా రాష్ట్రంలో ఓదార్పు యాత్ర ఎలా చేస్తావని, ఇదే కేసీఆర్ తనయ కవిత, కుమారుడు కేటీఆర్ ప్రశ్నించారు. అయినా సరే వరంగల్ జిల్లా మానుకోటలో ఓదార్పు యాత్రకు వెళ్లిన జగన్పై రైల్వే స్టేషన్లో రాళ్లతో దాడి చేయడం వెనక టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారన్నది వాస్తవం. రాష్ట్రంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇంకా ప్రజల కళ్ల ముందు కనిపి స్తూనే ఉంది. ఇక, జగన్ను జైలులో పెట్టిన తర్వాత మాట్లాడిన టీఆర్ఎస్ నేతలు మా రాష్ట్రంలోని జైళ్లలో జగన్ను పెట్టొద్దు.. పెడితే మా పోరగాళ్లు పాడైపోతరు! అంటూ ఫైర్ బ్రాండ్ మాదిరిగా వ్యాఖ్యలు సంధించారు.
ఇక, అదే సమయంలో 2014లో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా గుండుగుత్తుగా కలుపుకొని వైసీపీని విలీనం చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు, తెలంగాణకు మద్దతివ్వని జగన్ను ప్రజలు ఎండగట్టాలని పిలుపు నిచ్చారు కేసీఆర్. మరి ఇలాంటి నాయకులు ఇప్పుడు జగన్పై అభిమానం కురిపిస్తున్నారు. సీఎంగా ఎన్నికైన వెంటనే ప్రశంసించారు. అదేవిధంగా.. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఏపీ, తెలంగాణల మధ్య స్నేహం ఉండాలని అభిలషించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలో తనకు అనుకూలంగా చూసుకునే కేసీఆర్ ఒక్కసారిగా జగన్ విషయంలో ఇలా యూటర్న్ తీసుకోవడంపై రీజన్ ఏంటనే విషయం ప్రశ్నగా మారింది.
సొంత మేనల్లుడు హరీష్రావునే తనకు అనుకూలంగా మార్చుకుని తర్వాత వదిలేసిన కేసీఆర్.. ఇప్పుడు జగన్ విషయంలో ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? రీజన్ ఏంటనేది అంతుబట్టడం లేదు. ఇటీవల ఏపీ ఆస్తులను తమకు అనుకూలంగా ఏకపక్షంగా తీసుకున్నారు. ఇక, ఇప్పుడు ఏం చేస్తారు? అనే ప్రశ్న వస్తోంది. దీర్ఘకాలిక వ్యూహాల అమలులో భాగంగానే ఈ కసరత్తును కెసీఆర్ చేస్తున్నట్లు భావిస్తున్నారు. గత కొంత కాలంగా తెలంగాణలో అత్యంత బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన కీలక నేతలు అందరినీ కెసీఆర్ తన వైపు తిప్పుకోగలిగారు. ఇక తెలంగాణలో నిరుపయోగంగా ఏపీ ఉన్న భవనాలు తెలంగాణకు అప్పగించడంలో జగన్ చాలా సులువుగా ఓకే చెప్పేశారు. జగన్ తో ఈ స్నేహబంధం ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో అది తమకు ఖచ్చితంగా ఉపయుక్తంగా ఉంటుందనేది కెసీఆర్ ఆలోచనగా ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్తో స్నేహం చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.