ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉండిపోయిన పోలీసులకు వీక్లీ ఆఫ్ సదుపాయం  అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులకు  ఇప్ప‌టి వ‌ర‌కు లేదు. కాని ఇప్పుడు వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ స‌దుపాయం క‌ల్పించింది. రాష్ట్రంలో నేటి నుంచి వారాంతపు సెలవు అమలులోకి రానుండగా, కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయిలోని వారంతా వారంలో ఒకరోజు పూర్తిస్థాయిలో కుటుంబంతో గడిపే అవకాశం దగ్గరైంది. ఇక తమకు ఇంతటి సదుపాయాన్ని కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేలు మరువబోమని అంటున్నారు పోలీసులు. నేడు వీక్లీ ఆఫ్ పొందిన వారు, తమ కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లనున్నామని, మధ్యాహ్నం రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేస్తామని చెబుతుండగా, తన తండ్రి ఇంట్లోనే ఉండటంతో, నేడు స్కూల్ కు డుమ్మా కొట్టామని చిన్నారులు అంటున్నారు.


డాష్ బోర్డ్‌ ద్వారా పారదర్శకంగా వీక్లీ ఆఫ్‌లను మరో నెల రోజుల్లో అమల్లోకి తెస్తామంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. దీనిపై ప్రతి నెల ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని.. ఇబ్బందులన్ని పరిశీలించి.. పరిష్కరిస్తామన్నారు. పని ఒత్తిడితో పోలీసు సిబ్బందికి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని.. కాస్త వయసు మీదపడిన సిబ్బందికి ఈ సమస్య వెంటాడుతోందంటున్నారు. వీక్లీ ఆఫ్‌లతో పోలీస్ సిబ్బందిపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందంటున్నారు. 


కాగా, పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న సిబ్బంది, వారు చేసే పని తదితరాల ఆధారంగా 19 రకాల ఆప్షన్స్‌ తో వారాంతపు సెలవును అమలు చేసేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా, వాటికి ఆమోదముద్ర పడింది. ప్రతి యూనిట్‌ ఆఫీసర్‌ ఈ 19 ఆప్షన్స్ లో ఒకదాన్ని తాను ఎన్నుకోవచ్చు. ఆపై రెండు నెలలకోసారి అవసరమైతే మార్పు చేర్పులు చేస్తుంటారు. ఎవరు ఎప్పుడు సెలవులో ఉంటారన్న విషయం ఉన్నతాధికారులకు తెలిసేందుకు ఓ ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ సైతం సిద్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: