ఒకింత నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురవడం ప్రారంభం అయ్యాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అందుకే రాష్ట్రవ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ రోజూ కంటే రెట్టింపైంది. దీంతో పలువురు ఇళ్లకు చేరడానికి మెట్రో సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. వారిలో సామాన్య జనం మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. హీరో నితిన్ ఇలా ట్రాఫిక్లో చిక్కుకున్న సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
షూటింగ్ ముగించుకుని నితిన్ ఇంటికి వెళ్లానుకోగా ట్రాఫిక్ తారా స్థాయిలో ఉండటం గమనించి కారులో వెళితే ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళమనుకుని మెట్రో రైల్ ఎక్కారు. హీరోను మెట్రో రైలులో చూడటంతో ప్రయాణీకులు ఆయనతో సెల్ఫీలు దిగారు. నితిన్ సైతం మెట్రో ఎక్కడం చాలా బాగుందని అన్నారు. కాగా, నగరంలోని గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, ఆల్విన్ కాలనీ, హైదర్నగర్, బాలాజీ నగర్, బోరబండ, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్నగర్, అమీర్పేట, ఎస్ఆర్నగర్, వెంగళరావునగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, పంజాగుట్ట, షేక్పేట, పాతబస్తీ, చార్మినార్, బహదూర్పురా, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట, కామటిపురా, దారుల్షిఫా, హబ్సిగూడ, తార్నాక, లాలాపేట్, నాచారం, అంబర్పేట, కాచిగూడ, నల్లకుంట, దిల్సుఖ్నగర్, కొత్తపేట, సరూర్నగర్, ఎల్బీనగర్, మన్సూరాబాద్, వనస్థలిపురం, నాగోల్, హయత్నగర్, పెద్దఅంబర్పేట, అబ్దుల్లాపూర్మెట్, సికింద్రాబాద్, ప్యారడైజ్, బేగంపేట, బోయిన్పల్లి ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం కలిగింది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం పడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హాలియా, నిడమనూరు, చండూరు, నేరేడుగొమ్ము, మునుగోడు, పెద్దమునిగల్, పెద్దవూర, గుర్రంపోడు, దేవరకొండ ప్రాంతాల్లో వర్షం కురిసింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోనూ ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది. దీంతో రైతుల ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.