తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ వైపు కేంద్ర బడ్జెట్‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఆస‌క్తిరంగా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం చాలా ముఖ్యమైన రోజు అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో నిర్మలా సీతారామన్ అధ్యక్షత జరిగిన జీఎస్టీ మండలి సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడంపై ఆమె స్పందించారు.


అధ్యక్షతన శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ మొదటి సమావేశం జరిగింది. ఈ సంద‌ర్బంగా నిర్మ‌లా సీతారామాన్ మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన బిజీగా ఉన్నారని, అందుకే సమావేశానికి హాజరుకాలేదని పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఏపీ సీఎం లు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా ప్రాజె క్టు ప్రారంభోత్సవంలోనే ఉన్నట్టు చెప్పారు. ఆ మూడు రాష్ర్టాలు వారి ప్రతినిధులను సమావేశానికి పంపించాయని, ముందస్తుగా కార్యక్రమాలను నిర్ణయించుకోవడం వల్ల తాము రాలేకపోతున్నామని స్పష్టంగా చెప్పినట్టు ఆమె తెలిపారు. 


ఇదిలాఉండ‌గా, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ సులభతరం చేసేందుకు ఆధార్ తో జీఎస్టీ రిజిస్ట్రేషన్ కు నిర్ణయించారు. జీఎస్టీ యాంటీ-ప్రాఫిటీరింగ్ అథారిటీ పదవీకాలం రెండేళ్లకు పెంచారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వివరించారు. ఆన్ లైన్ లో అప్లై చేసే వ్యక్తులు తమ ఆధార్ నెంబర్ ఉపయోగించి ఓటీపీ పొంది జీఎస్టీఎన్ పోర్టల్ లో స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చని.. జీఎస్టీఎన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను పొందవచ్చని చెప్పారు. ఇప్పుడు రెండు నెలల వరకు జీఎస్టీ రిటర్న్ లు దాఖలు చేయకపోతే ఈ-వే బిల్లు జనరేట్ కాకుండా నిషేధం విధిస్తారు. ఈ ఆదేశాలు 21 జూన్ కి బదులు 21 ఆగస్ట్ నుంచి అమలవుతాయి. ఈ-వే బిల్ సిస్టమ్ సామాగ్రిని రవాణా చేసేటపుడు రవాణా వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. తప్పు చేసిన సంస్థపై ప్రాఫిటీరింగ్ మొత్తంపై 10 శాతం జరిమానా విధిస్తారు.


గత కొన్ని నెలల్లో తీసుకున్న అనేక మార్పులకు జీఎస్టీ కౌన్సిల్ అమోదముద్ర వేసిందని పాండే తెలిపారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ పరిమితిని రూ.20 లక్షల నుంచి పెంచి రూ.40 లక్షలు చేశారు. గతంలో ఇది నోటిఫికేషన్ ద్వారా జరిగింది. ఇప్పుడు చట్టాల్లో తగిన మార్పులు చేయడం జరిగింది. రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న డీలర్లు త్రైమాసిక ఆధారంగా రిటర్న్ లు దాఖలు చేయాలని రెవెన్యూ కార్యదర్శి తెలిపారు. రూ.5 కోట్లకు మించి టర్నోవర్ ఉన్నవారు నెలనెలా రిటర్న్ దాఖలు చేయాలి. ఇంతకు ముందున్న వ్యవస్థలో అనేక పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆధార్ ఉపయోగించాలని నిర్ణయించినట్టు ఆయన ప్రకటించారు. ఆధార్ ఉపయోగం వల్ల పరిశ్రమలకు అనేక లాభాలు ఉంటాయని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: