ఆంధ్రప్రదేశ్ పత్రిక మఖచిత్రంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ బ్లాక్ అండ్ వైట్ ఫొటో వేయడం వెనుక ఉన్న క్రియేటివిటీని ఆ పత్రిక ఎడిటర్ నరేష్ నున్నా, ఈ రోజు బయట పెట్టారు.
'' ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాస పత్రిక తెలుగు, ఇంగ్లీషు ఎడిషన్లకు శ్రీ కందుల రమేష్ గారు ఛీఫ్ ఎడిటర్ అయితే, నేను రెండు ఎడిషన్లకూ ఎడిటర్ ని. మేమిద్దరం కాకుండా మరో ఐదుగురు ఏడిటోరియల్ స్టాఫ్ వివిధ హోదాల్లో ఉన్నాము. 22 జూన్, 2019 - అంటే నిన్న, ఒక ఇంగ్లీషు దినపత్రిక విజయవాడ ఎడిషన్ లో వచ్చిన వార్త కొద్ది గంటల వ్యవధిలో తెలుగు వెబ్ ప్రపంచంలో పై వార్త ఆధారంగా మరికొంత తమదైన మసాలాలు చేర్చుతూ, కూర్చుతూ మరి కొన్ని కథనాలు వచ్చాయి.
1. జగన్ను అవహేళన చేసేలా ప్రభుత్వ మేగజైన్
2. జగన్ను ఘోరంగా అవమానించిన అధికార పత్రిక... ఏమిటీ కథ..?!
3, సీఎం జగన్ ఫొటో బ్లాక్ అండ్ వైట్లో.. ఏపీ ఖజానాకు అర కోటి నష్టం!
ఇలా రకరకాల కథనాలు వచ్చాయి. కవర్ పేజీ ఫొటో కోసం, జగన్ గారి మంచి ఫోటోల కోసం రకరకాలుగా ప్రయత్నిస్తూ, చివరికి ఛీఫ్ ఎడిటర్ ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఫైనలైజ్ చేశారు. ఒకవేళ, అది ఆయన ఉద్దేశపూర్వకంగానే, జగన్ గారు ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేకే చేసుంటే- లోన పేజీలలో ఇన్ని ఫొటోలు వాడి ఉండేవారు కారేమో.
నా వరకూ నాకైతే, చాలా మంది గొప్ప గొప్ప ఫోటోగ్రాఫర్లు నలుపు తెలుపు ఫోటోల గురించి ఎప్పటినుంచో చెబుతున్న కోట్స్ ఎన్నో చదివి ఉన్నాను కాబట్టి, అటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇష్టపడతాను కాబట్టి, చాలా విస్పష్టంగా వచ్చిన తీర్పు కావడం చేత, మహావిజయం కావడం వల్ల, ఆ విస్పష్టతని సూచించే బ్లాక్ అండ్ వైట్ వాడారేమో అనుకున్నాను.
కానీ, బ్లాక్ అండ్ వైట్ అశుభం అని నమ్మిన పూర్వ కమీషనర్ నుంచి అలా అలా పాకి ఉండొచ్చు. కింది వాళ్ళు, పై వాళ్లు, అభిమానులు అటువంటి అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు. '' అని తన ఫేస్బుక్ పేజీలో రాశారు నరేష్.
మరి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో అంత గొప్పతనం ఉంటే ఈ ఐదేళ్లలో చంద్రబాబుగారి ఫొటో ఎందుకు వేయలేదు నరేష్ గారూ అని నెటిజన్లు పంచ్లు వేస్తున్నారు.