కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ వరుస వివాదాలతో ఊహించని కీతిలొ వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ దొంగలందరికీ ఇంటిపేరు మోదీ ‘ అని ఉంటుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గాను బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ఆయనపై పరువునష్టం దావా వేశారు. దీన్ని విచారించిన పాట్నాకోర్టు.. రూ. 10 వేల పూచీకత్తుపై ఆయనకు బెయిలు మంజూరు చేసింది. మోదీ ప్రభుత్వానికి గానీ, బీజేపీ-ఆర్ఎస్సెస్ కి గానీ ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిని మోదీ సర్కార్ కోర్టు కేసులతో భయపెడుతుందని రాహుల్ దుయ్యబట్టారు. ఇలా పొలిటికల్ బిజీలో పడినప్పటికీ...రాహుల్ తన రిలాక్స్ టైం మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి తనకు వద్దంటే వద్దని రాజీనామా చేసి రాహుల్ అనంతరం సామాన్యుడిలా హిందీ మూవీ.. ‘ ఆర్టికల్-15 ‘ ని ఢిల్లీలోని ఓ థియేటర్లో చూసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ఆ సినిమా రాహుల్ను ఇంప్రెస్ చేయగా తాజాగా ఓ దోస ఆయన మనసు దోచుకుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా పాట్నాలోని ఓ చిన్న రెస్టారెంట్ లో దోసె తింటూ కనిపించారు.
బీహార్ డిప్యూటీ సీఎం వేసిన పరువు నష్టం కేసులో పాట్నాలోని కోర్టు బెయిలు మంజూరు చేయడంతో.. రాహుల్ ఢిల్లీ వెళ్ళడానికి విమానాశ్రయానికి వెళ్లేముందు.. ఈ హోటల్ చేరుకొని అక్కడ సౌతిండియన్ డిష్ అయిన దోసెను ఇష్టంగా తిన్నారు. ఆయన వెంట ఏఐసీసీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ గోహిల్, రాష్ట్ర పార్టీ చీఫ్ మదన్ మోహన్ ఝా తదితరులున్నారు. రాహుల్ దోసె తినడాన్ని పలువురు జర్నలిస్టులు ఎంచక్కా ఫోటోలు తీసుకున్నారు. ఆయన సెక్యూరిటీ కూడా ఇందుకు అనుమతినిచ్చింది.