తెలుగుదేశం పార్టీలో ఫిజిక్ పరంగా చూసినా, గొంతు పరంగా చూసిన కొండంత అండగా సిక్కోలు అచ్చెన్న ఉంటారు. బాబోరు తొలి సభలో అతి తక్కువ మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో కూర్చోవడానికే బాధపడుతూంటే అచ్చెన్న బాగా ఆదుకున్నాడు. అసలు సభలో టీడీపీ తరఫున గొంతు బాగా వినిపించింది అంటే అది అచ్చెన్న్న పుణ్యమే.
ఇదిలా ఉండగా టెక్కల నుంచి టిడిపి అభ్యర్దిగా గెలిచిన కింజారపు అచ్చెన్నాయుడు ఎన్నికల అఫిడవిట్లో ఆయనపై ఉన్న అరెస్ట్ వారెంట్ను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని.. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీచేసి ఓడిపోయిన పేరాడ తిలక్ తాజాగా డిమాండ్ చేశారు. 2007 జూలై 21న మైనింగ్ కార్యాలయంపై దాడి ఘటనలో హైరిహల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం 34/2007 కేసులో ఆయనపై ఉన్న అరెస్ట్ వారెంట్ ఇంకా పెండింగ్లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఓబులాపురం మైనింగ్ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు 21వ నిందితుడిగా అచ్చెన్నాయుడుపై అరెస్ట్ వారెంట్ కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. దీనిపై చివరి వరకూ న్యాయం పోరాటం చేస్తానని పేరాడ తిలక్ తెలిపారు. మరి ఇదే నిజమైతే మాత్రం అచ్చెన్నకు కోర్టు కష్టాలు తప్పవు. కోర్టు తీర్పు కనుక యాంటీగా వస్తే అచ్చెన్న పెద్ద గొంతు పూర్తిగా మూగబోయే ప్రమాదం ఉంది.