కర్నాటక కధ ముంబైకి చేరింది. అక్కడ రెబెల్ ఎమ్మెల్యెలు విడిది చేసిన ఓ హొటల్ ఇపుడు రాజకీయ ప్రకంపనలు స్రుష్టిస్తోంది. తాజాగా ముంబైలో కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద ఈ రోజు ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది. అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్కు చుక్కెదురు అయింది. హోటల్ బయటే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హోటల్ లోనికి ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ శివకుమార్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. రెబల్స్లో కొంతమంది ఎమ్మెల్యేలు చర్చలకు రమ్మంటేనే తాను వచ్చానని అన్నారు. అంతేకాకుండా తాను కూడా హోటల్లో రూమ్ బుక్ చేసుకున్ట్లు ఆయన తెలిపారు.
అయితే భద్రత పేరుతో తమను అడ్డుకుంటున్నారంటూ శివకుమార్ ఆరోపించారు. శివకుమార్తో పాటు జేడీఎస్ ఎమ్మెల్యే శివలింగగౌడ కూడా ముంబై వచ్చారు. మరోవైపు సీఎం కుమారస్వామి, డీకే శివకుమార్ వల్ల తమకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు ముంబై పోలీస్ కమిషనర్కు లేఖ రాయడంతో హోటల్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పెద్దల నుంచి తమకు ముప్పు ఉదని భావిస్తున్న రెబెల్ ఎమ్మెల్యేలు 14 మంది వేరే చోటకు మకాం మార్చేందుకు కూడా రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే పూణే, లేదా గోవా వారు మకాం మార్చే చాన్స్ ఉందని అంటున్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు లోపాయికారిగా బీజేపీ చేస్తోందని అంటున్నారు.
మొత్తానికి రాష్త్రపతి పాలన దిశగా కర్నాటకం నడుస్తోంది. ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుమారస్వామి సర్కార్ మైనారిటీలో పడిపోయింది. దీంతో గవర్నర్ వాజుభాయ్ వాలా సరైన సమయం చూసుకుని రాష్ట్రపతి పాలనకు సిఫార్స్ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే కుమర సర్కార్ కి నూరేళ్ళు నిండినట్లే.