భారతదేశంపై జరుగుతున్న అంతర్జాతీయ కుట్ర మరోమారు తెరమీదకు వచ్చింది. కరడు గట్టిన ఆల్ఖయిదా చీఫ్ అయ్మన్ అల్ జవహరి తాజాగా సంచలన పిలుపు ఇచ్చాడు. కశ్మీర్లో భారత ఆర్మీపై జిహాదీ దాడులకు పాల్పడాలని తాజాగా ఓ వీడియోలో పిలుపునిచ్చాడు. కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులను ఉద్దేశించి సుమారు 14 నిమిషాలు ప్రసంగించిన వీడియోను రిలీజ్ చేశారు. ఆల్ఖయిదా ఉగ్ర గ్రూపుకు చెందిన మీడియా వింగ్ ఆ వీడియోను బయటపెట్టింది. కశ్మీర్ ప్రభుత్వంపై, అక్కడ ఉన్న ఆర్మీపై దాడులు చేయడమే లక్ష్యంగా జిహాదీలు ముందుకు వెళ్లాలని జవహరి తన వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఆర్మీపై దాడులతో భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపరుచాలని, మానవశక్తి-సాంకేతిక శక్తిలోనూ భారత్ను కోలుకోలేని దెబ్బతీయాలన్నాడు.
``మానవ శక్తి,, ఆయుధ సంపత్తిలో భారత దేశానికి భారీ నష్టాలు కల్పించండి.. పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం కూడా అమెరికా చేతిలో కీలుబొమ్మలు..ఉగ్రవాదులు పాక్ ట్రాప్ లో పడరాదు`` అని జవహరి ఈ వీడియోలో పేర్కొన్నాడు. పాక్ ఆర్మీ, ప్రభుత్వం కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ముజాహిదీన్ లను వాడుకోవాల చూస్తున్నాయని, ఆ ప్రయోజనాలు తీరిన తరువాత వారిని అవతల పారేస్తున్నాయని పాక్ పై కూడా ధ్వజమెత్తాడు. ఇండియాతో పాకిస్తాన్ ఘర్షణ అన్నది అమెరికన్ ఇంటెలిజెన్స్ అజమాయిషీలో సరిహద్దులపై జరిపే ‘ సెక్యులర్ ‘ పోరాటం తప్ప మరేమీ కాదని అభివర్ణించాడు. కాశ్మీర్ లో మసీదులు, మార్కెట్లు, ముస్లిములు చేరే ప్రదేశాలను టార్గెట్లు చేయకండి అని టెర్రరిస్టులను జవహరి కోరాడు.
భారత సైన్యంపై జిహాదీలకు దిగేందుకు కావాల్సిన గ్రూపును ఆల్ఖయిదా తయారు చేస్తున్నట్లు ఓ రిపోర్ట్లో తేలింది. ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ లాంగ్ వార్ జర్నల్ తన వ్యాసంలో ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా తొత్తుగా పాకిస్థాన్ వ్యవహరిస్తుందన్నాడు. ఆల్ ఖయిదాకు చెందిన ఇండియన్ సెల్ను జాకిర్ ముసా ప్రారంభించాడు. అయితే అతని గురించి జవహరి తన ప్రసంగంలో ఏమీ చెప్పలేదు. జకీర్ మూసా గురించి జవహరి ప్రస్తావించకపోయినప్పటికీ.. స్క్రీన్ పై అతని ఫోటో కనబడేలా వీడియో తీసి.. తన ఉద్దేశమేమిటో చాటాడీ కరడుగట్టిన ఉగ్రవాది. కశ్మీర్లో జరుగుతున్నపోరు .. ఓ వేర్పాటు సమస్య కాదు అని, కానీ ప్రపంచం వ్యాప్తంగా ఉన్న శక్తులపై ముస్లింలు చేపడుతున్న జిహాదీ పోరుగా జవహరి అభివర్ణించాడు. ముస్లిం పెద్దలు ఈ తత్వాన్ని ప్రచారం చేయాలని పిలుపునిచ్చాడు. తన కుడివైపున రైఫిల్, ఎడమవైపున ఖురాన్ పట్టుకుని ఈ ఉగ్రవాది ఈ వీడియో రూపొందించాడు.