ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేఏపాల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన వీడియోలే దర్శనమిచ్చాయి. అయితే ఎన్నికల్లో మాత్రం ఆదరణ దక్కలేదు. ఆ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతు అయిపోయింది. అయినప్పటికీ..కేఏ పాల్ క్రేజ్ తగ్గలేదు.
కేఏ పాల్కు సంబంధించిన ఆసక్తికర ఘట్టాలతో ఆయన బయోపిక్ రానుంది. దీనిని రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తుండగా, ఇందులో సునీల్ కేఏపాల్గా నటిస్తారని సమాచారం. కేఏ పాల్ వలే ఈ సినిమాలోనూ అనేక సంచలనాలు ఉంటాయని సమాచారం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్, హాలీవుడ్ స్టార్ నటి ఏంజెలీనా జోలీ పాత్రలు కూడా ఉంటాయట. వాటికి సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా జరగుతుందట.
హీరో నుండి మళ్ళీ కమెడీయన్గా టర్న్ తీసుకున్న సునీల్ చివరిగా చిత్రలహరిలో నటించాడు. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా తెరకెక్కుతురన్న చాణక్య చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం సునీల్ అమెరికాలో ఉండగా ఆయనకి హాలీవుడ్ మేకప్ మ్యాన్ మేకొవర్ చేస్తున్నాడట. సునీల్ అమెరికా నుండి హైదరాబాద్ వచ్చాక చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.