ఏపీ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం ఎవరు ఊహించని నిర్ణయాలతో ఏపీ బిజెపి నేతలకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టు కోసం చాపకింద నీరులా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఏపీలో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ పై దృష్టి పెట్టిన బీజేపీ ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుంది. టిడిపి రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలో నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు... మాజీ ఎమ్మెల్యేలు...తాజా ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాల ఇన్చార్జిలను కూడా బిజెపి చేర్చుకునేందుకు మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరితో పాటు... గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఎమ్మెల్సీ, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ అన్నం సతీష్ ప్రభాకర్ కూడా బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పదవికి ఎసరు పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా కన్నాపై పెద్ద కుట్ర జరుగుతుందని... ఏపీ బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
టీడీపీలోని కీలక నేతలను తమ పార్టీలోకి లాగేసుకుని ప్రతిపక్ష హోదాను అనుభవించాలని ఉవ్విళ్లూరుతోంది. బీజేపీలో టీడీపీ వాళ్ల డామినేషన్ ఎక్కువ అవ్వడంతో వారు కన్నాను తమ నేతగా అంగీకరించే పరిస్థితి లేదట. అందుకే జంప్ జలానీలు సుజనా చౌదరి నేతృత్వంలో పెద్ద టీంగా ఏర్పడి వారంతా కన్నాను పార్టీ పదవి నుంచి తప్పించేసే ప్రయత్నాలు జోరుగా చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం ఏపీ నాయకులు బీజేపీలో చేరుతున్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణ లేకపోవడంతో ఈ చర్చ మొదలైంది.
జంప్ జలానీలు ఎక్కువుగా చేరుతుండడంతో వారిపై దృష్టి పెడుతోన్న బీజేపీ అధిష్టానం కన్నాను పూర్తిగా పక్కన పెట్టేసింది. కన్నా కోటరీ పని బీజేపీలో అయిపోయిందని.. ఇప్పుడు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లే వాళ్లకే. ఇంకా చెప్పాలంటే సుజనా చౌదరి హవాయే నడుస్తోందని అంటున్నారు. త్వరలో కన్నాను పదవి నుంచి సైతం తప్పిస్తారని.. ఆ ప్లేస్లోకి సుజనా చౌదరి వర్గానికి చెందిన నేత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వచ్చే అవకాశం ఉందంటున్నారు.