కర్ణాటకలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్నది. కర్ణాటకలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో ఎలాగైనా బలాన్ని నిరూపించుకొని పాలనకు ఢోకా లేదు అనిపించుకోవడానికి కుమారస్వామి ప్రభుత్వం రెడీ అవుతున్నది.
ఈనెల 17 వ తేదీన తమ బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోవాలని చూస్తోంది. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. సోమవారం అన్ని పార్టీలు అసెంబ్లీ నిర్వహణ విషయంపై సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలోనే అసెంబ్లీలో బల నిరూపణకు సంబంధించిన తేదీని ఖరారు చేస్తారని తెలుస్తోంది.
మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ లు దిగి వచ్చి.. ఆయా ఎమ్మెల్యేల కోరికలు తీర్చేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతున్నది.
దీనిపై బీజేపీ నాయకుడు యడ్యూరప్ప తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అనేక విషయాల గురించి చర్చించారు. అంతేకాదు, సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. సో, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి బీజేపీ కూడా రెడీ అయ్యిందన్నమాట.