తాజా సార్వ‌త్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ నేతల మ‌ధ్య గ్రూపు త‌గాదాలు హెచ్చుమీరుతున్నాయి. చంద్ర‌బాబు వార్నింగ్‌లు ఇచ్చినా కూడా నేత‌లు మాత్రం ఆయ‌న మాట‌లు లెక్క చేయ‌కుండా ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్నారు. కీలకమైన కృష్ణాజిల్లాలో విజయవాడ ఎంపీ కేసినేని నాని కొద్దిరోజులుగా ఫేస్బుక్ పోస్టులతో పరోక్షంగా చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు పార్లమెంట్లో తనకు అప్పగించిన పదవిని సైతం ఆయన సోషల్ మీడియా వేదికగా తిరస్కరించారు.


చంద్రబాబు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నాని వద్దకు రాయబారం పంపి ఆయ‌న్ను చ‌ల్లార్చే ప్రయత్నం చేసినా... నాని మాత్రం సోషల్ మీడియాలో తన కాంట్రవర్సి పోస్టులు ఆపటం లేదు. తాజాగా ఆదివారం నాని టిడిపికి చెందిన ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నను టార్గెట్ గా చేసుకుని పెట్టిన పోస్టు టిడిపి వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కేశినేని సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టారో లేదో వెంటనే వెంకన్న నుంచి కౌంటర్ వచ్చేసింది.


ఈ ఇద్ద‌రి పోస్టులు చూస్తే ముందుగా నాని నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడని ఎద్దేవా చేశారు. అందులోనే నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్‌ చేస్తున్నాడు... ఇది మన దౌర్భాగ్యం అని కూడా విమ‌ర్శించారు. వెంట‌నే వెంక‌న్న దీనికి కౌంట‌ర్‌గా ‘సంక్షోభం సమయంలో పార్టీ కోసం...నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు..చనిపోయేవరకూ చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’ అంటూ ట్వీట్‌ చేశారు. 


విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంపై ఆధిప‌త్యం కోసం ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య జ‌రుగుతోన్న కోల్డ్‌వార్‌లో భాగంగానే వీళ్లు ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్న‌ట్టు బెజ‌వాడ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది. ప‌శ్చిమ‌లో వెంక‌న్న ఆధిప‌త్యాన్ని త‌ప్పించి త‌న వ‌ర్గాన్ని నాని పెంచుకోవాల‌ని చూస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఈ పోస్టు పెట్టిన‌ట్టు టాక్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: