తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు బెయిల్ మంజూరైంది . మంగళవారం రాత్రి ఆయన స్టేషన్ బెయిల్ పై విడుదలయ్యారు. మలికిపురం పోలీస్ స్టేషన్ పై తన అనుచరులతో కలిసి రాపాక దాడి చేశారని ఆయనపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే . ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం తో మలికిపురం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, రాపాక పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు ఆయన్ని కోర్టులో హాజరు పరిచారు.
ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు వెళ్లాలని పోలీసులకు జడ్జీ సూచించడమే , కాకుండా రాపాక స్టేషన్ బెయిలు మంజూరు చేయాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు వెంటనే రాపాక కు స్టేషన్ బెయిలు మంజూరు చేశారు. మలికిపురం లో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని ఆదివారం రాత్రి ఎస్సై రామారావు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని వదిలిపెట్టాలని ఎమ్మెల్యే రాపాక పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్సై రామారావును కోరారు . అందులో ఒకరు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, కనీసం అతన్ని ఒక్కన్ని అయినా విడిచిపెట్టాలని కోరగా, ఎస్సై రామారావు నిరాకరించడం తో ఆయన స్టేషన్ నుంచి తిరిగి వెళ్లిపోయారు .
ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోయినా జనసేన కార్యకర్తలు మాత్రం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఉండడంతో ఎస్సై రామారావు అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలియడం తో , మళ్లీ రాపాక పోలీసులకు స్టేషన్ కు వచ్చి బైఠాయించారు . దీనితో పోలీసు స్టేషన్ పై ఎమ్మెల్యే రాపాక తన అనుచరులతో కలిసి దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు .