జులై 21 వ తేదీన రోదసీలోకి మార్క్ 3 ద్వారా చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని పంపిన తరువాత ఇస్రో పేరు మారుమ్రోగిపోయింది. ఇస్రో గురించి భారతీయుల ప్రతి ఒక్కరికి తెలిసిందే. సెప్టెంబర్ 7 వ తేదీన ల్యాండర్ చంద్రునిపై దిగబోతుంది అనే వార్త ప్రతి ఒక్కరికి తెలిసింది. దీంతో ఆ రోజు అర్ధరాత్రి అందరూ ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. వందకోట్లమంది టివిలకు అతుక్కుపోయారు. చివరి నిమిషంలో ల్యాండర్ సిగ్నల్స్ మిస్ కావడం అందరిని బాధించింది.
ఆ సమయంలో ప్రధాని మోడీ స్ఫూర్తినిచ్చే విధంగా ప్రసంగం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపారు. ఇస్రో శాస్త్రవేత్తలు చేసింది తక్కువేమి కాదని పేర్కొన్నారు. భవిష్యత్తులో చేయాల్సినవి చాలా ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ మాటలతో ఇస్రో స్ఫూర్తి చెందింది. ఆ మరుసటి రోజే ఆర్బిటర్ ల్యాండర్ ను గుర్తించింది. దాంతో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇస్రో చైర్మన్ పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకోవడంతో ప్రధాని మోడీ శివన్ ను ఓదార్చారు. ఆ సంఘటనతో శివన్ దేశం మొత్తం తెలిసిపోయారు. శివన్ గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆయన్ను ఇంటర్వ్యూ చేయడానికి ప్రముఖ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మీరు తమిళులుగా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారని అడిగితె.. దానికి అదిరిపోయే సమాధానం చెప్పాడు శివన్.
మొదట తాను భారతీయుడిని. భారతీయుడిగానే ఇస్రోలో ఉద్యోగం సంపాదించాను. ఇస్రోలో అనేకమంది అనేక ప్రాంతాలనుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. అందరం భారతీయులుగానే సపోర్ట్ చేసుకుంటాం తప్పించి మతం, ప్రాంతం ప్రాతిపదికకు అక్కడ చోటులేదు అని చెప్పారు. జాతీయ భావనతోనే పనిచేస్తామని చెప్పడంతో నెటిజన్లు ఫిదా అయ్యారు. శివన్ ను వేనోళ్ళ పొగుడుతున్నారు. శభాష్ శివన్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇస్రోలో జాతీయతా భావం ఉండాలని అదే ముందుకు నడిపిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.