తెదేపా అధ్యక్షులు బాబుగారు తలపెట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్న తతంగం గురించి ఈ రోజు అంతా నిరంతర వార్తలు వస్తూనే ఉన్నాయి. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని బయలుదేరిన చంద్రబాబును కనీసం బయటకి కూడా రానివ్వకుండా, ఆయన ఇంటి ద్వారాలని మూసివేయడంతో.. రగిలిపోయిన టీడీపీ తమ్ముళ్లు ఇంకా ఆక్రోశం కక్కుతూనే ఉన్నారు. మధ్యలో భోజనానికి కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఇక పనిలో పనిగా టీడీపీ నాయకులు కూడా జగన్ ప్రభుత్వం విమర్శలు ఎక్కు పెట్టారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది పరాకాష్ట అని, శాంతియుతంగా తలపెట్టిన ఛలో ఆత్మకూరు యాత్రను గృహనిర్బంధాలతో అడ్డుకోవడం పిరికి చర్య అని.. పైగా పునరావాస బాధితులకు ఆహారాన్ని అడ్డుకోవడం అనేది ప్రభుత్వ నిర్దయకు నిదర్శనం అని బాబుగారు బలమైన పదాలతో ఈ సారి కాస్త గట్టిగానే విమర్శలు చేశారు. అలాగే మిగిలిన నాయకులు తలా ఓ మాట అందుకొని.. ప్రజాస్వామ్యంలో ఇదో చీకటి రోజు అని, ఇంత ఫాసిస్ట్ పాలనను చూడలేదు అని.. వేలాది మంది హౌజ్ అరెస్టులు గర్హనీయం అని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచీ రాష్ట్రం రావణకాష్టం అయ్యిందని.. ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గేది లేదని.. బాధితులకు న్యాయం జరిగేవరకు బాబుగారితో కలిసి పోరాడుతాం అని స్పష్టం చేశారు టీడీపీ వాళ్ళు.
అయితే ఇదంతా వైకాపా ప్రభుత్వ అసమర్ధత అని, సమస్యను పరిష్కరించకుండా ఇటువంటి పిరికిపంద చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం తెదేపా కార్యకర్తలపై దాడులు చేయించింది, ఊళ్ళనుంచి వెళ్ళగొట్టింది. తెదేపా అండగా నిలిచి వారిని సొంత ఊళ్లకు చేర్చడానికి శాంతియుతంగా తలబెట్టిన చలో ఆత్మకూరును ఉక్కుపాదంతో అణిచేందుకు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ తెదేపా నేతలను నిర్బంధించారని బాబు, జగన్ పై ఫుల్ సీరియస్ అయ్యారు. అయితే ఎప్పటిలాగే జగన్ మాత్రం.. బాబు యాక్షన్ డైలాగ్ లు విని చిన్న స్మైల్ ఇచ్చారు తప్ప.. కనీసం చిన్న కామెంట్ కూడా చెయ్యలేదని వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. అయితే టీడీపీ నిరసనలు మాత్రం ఇంకా కొనసాగుతాయి అట, అలాగే పునరావాస శిబిరం కూడా కొనసాగుతుందని.. బాధితులకు న్యాయం చేసేదాకా టీడీపీ పోరాటం ఆగదని.. బాబు మీడియా సాక్షిగా పంచ్ డైలాగ్ కూడా పేల్చారు. మరి బాబు డైలాగ్ లు ఎంతవరకు పని చేస్తాయో చూడాలి.