అధికారం కోల్పోయిన నాటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జనం సటైర్లు కుమ్మేస్తున్న విషయం తెలిసిందే. ఒకపక్క వైసీపీ మంత్రులు చంద్రబాబుకు చిన్న మెదడు చితికిపోయిందని, అందుకే ఆయన అలా వ్యాఖ్యాని స్తున్నారని చేస్తున్న విమర్శలకు తోడు.. ఇప్పుడు సోషల్ మీడియా కూడా బాబుపై విమర్శల జోరు పెంచింది. అధికారం అనేది ఎవరికి ఎవరూ ఉదారంగా ఇచ్చుకునే వస్తువుకాదు, ఎవరి పెరటి తోటలోనో పూచిన పువ్వు కూడా కాదు. ప్రజలు మెచ్చి ఇచ్చే ఒక అవకాశం.
2014లోఅప్పటి రాష్ట్ర పరిస్థితిని గమనించిన ప్రజలు మేధావిగా, సీనియర్గా రాష్ట్రానికి ఆయన ఉపయోగపడతాడు.. అని భావించి అధికారం అప్పగించారు. ఇక, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబును పక్కన పెట్టింది కూడా ప్రజలే. ఈ క్రమంలోనే యువ నాయకుడు, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా జనం మదిని దోచుకున్న వైసీపీ అధినేత జగన్కు ప్రజలు అధికారం అప్పగించారు. అయితే, ఈ పరిణామాన్ని టీడీపీ అదినేత చంద్రబాబు సహించలేక పోతున్నారనేది నెటిజన్ల మాట. ఆయన ఎక్కడ మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, ఏం మాట్లాడినా.. ఇంకా తాను అధికారంలోనే ఉన్నాననే భ్రమలో ఉన్నారా? అనే సందేహం వస్తోందని అంటున్నారు.
రాజకీయాల్లో అధికారం ఉండడం, పోవడం అనేవి సర్వసాధారణమని, ఈ విషయాన్ని ఇప్పటికి నాలుగు మాసాలు గడిచినా.. బాబు జీర్ణించుకోలేక పోతుండడం దారుణంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా సీఎం జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు జీర్ణించుకోలేక పోతున్నారు. జగన్ను జీవితాంతం జైల్లో పెట్టినా తప్పులేదని బాబు అనడాన్ని వారు అసహ్యించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కౌంటర్లు పేలుతున్నాయి. `బాబూ ముందు తమ్ముళ్లు జైలు పాలవకుండా చూసుకోరాదూ..` అని మెజారిటీ కామెంట్లు కనిపిస్తున్నాయి.
అదే సమయంలో ఇప్పటి వరకు వివిధ కేసుల్లో అవి కూడా మీ హయాంలోనే నమోదైన కేసుల్లో జైలు పాలై ఊచలు లెక్కపెడుతున్న చింతమనేని ప్రభాకర్ పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక, అమరావతి భూకుంభకోణంలో అనేక మంది పాత్ర ఉన్నట్టు వస్తున్న విమర్శలపై మీరు స్పందిస్తే బాగుంటుందని, జగన్పై అనవసర రచ్చ చేయడం ద్వారా మీకు లభించే సానుభూతి ఏమీ ఉండదని అంటున్నారు. మరి సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు ఈ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని తనను తాను సరిదిద్దుకుంటారో లేదో చూడాలి.