గత 12 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె చేస్తున్న కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. బస్సులు కదలపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం పిల్లల స్కూల్ సెలవుల తేదీని పొడిగించింది. ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తున్నది. అంతేకాదు, తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఉద్యోగంలోకి తీసుకొని బస్సులను నడిపిస్తోంది.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశించింది. అంతేకాకుండా, సోమవారంలోగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించాలని ఆదేశించింది. సెప్టెంబర్ నెల జీతాలను ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదు. దీనిపై కూడా కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. మాములుగా 1 లేదా రెండు తేదీల్లో ఆర్టీసీ జీతాలు చెల్లించాలి. కానీ, ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదు.
ఇక ఇదిలా ఉంటె, ఆర్టీసీలో ఇప్పుడు డ్రైవర్లు, కండక్టర్లు, బస్టాండ్ లో సిబ్బంది ఇలా కొరత చాలా ఉన్నది. ఈ కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసే వ్యక్తులను డిప్యుటేషన్ పై ఆర్టీసీలో పనిచేసేందుకు పంపుతున్నది. ఇందులో భాగంగా నలుగురు వెటర్నరీ డాక్టర్లను ఇందుకోసం వినియోగించినట్టు తెలుస్తోంది. నాలుగు డాక్టర్లు ఆర్టీసీలో డిప్యుటేషన్ పై పనిచేయాలని కోరింది.
అయితే, ఆర్టీసీలో ఏ డిపార్ట్మెంట్ లో పనిచేయాలో, ఎన్ని రోజులు పనిచేయాలో కలెక్టర్ ఆదేశాల్లో చెప్పలేదు. దీంతో ఆ నలుగురు డాక్టర్లు ఆర్టీసీలో విధులకు హాజరుకాలేదు. ఇక కలెక్టర్ ఆదేశాలపై నెటిజన్లు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. వైద్యులు ఆర్టీసీలో ఎలాంటి పనిచేస్తారని, వారిని కండక్టర్లుగా మారి బస్సుల్లో తిరగమంటారా లేదంటే డ్రైవర్లుగా మరి బస్సులు నడపమంటారా అని ప్రశ్నిస్తూ చురకలు అంటిస్తున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.