ఇప్పటికే గత కొద్దిరోజలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఏపీ మాదిరిగా తమను కూడా ప్రభుత్వంలో విలీనం చేసి, తమ కోరికలను తీర్చాలని ఆర్టీసీ కార్మికులు ఇటీవల ప్రభుత్వంతో చర్చలు జరుపగా, ప్రభుత్వ పెద్దలు మాత్రం వారి కోరికలను తీర్చే విధంగా హామీ ఇవ్వకపోవడంతో ఆర్టీసీ నాయకులు సమ్మె బాట పట్టడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ చర్చల్లో ఆర్టీసీ నాయకుల గొంతెమ్మ కోరికలు తీర్చే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రానికి లేదని, కావున సమ్మె విరమించాలని ముఖ్యమంత్రి, ఆర్టీసీ నాయకులను కోరారు. 

అయితే నాయకులు అందుకు ససేమిరా అనడంతో వెంటనే ప్రభుత్వ యంత్రాగాన్ని రంగంలోకి దించి ప్రైవేట్ బస్సు డ్రైవర్స్ అలానే కండక్టర్స్ ని తాత్కాలికంగా తీసుకుని ప్రజలకు సేవలు అందించాలని ఒక హుకుం జారీ చేసారు సీఎం. కాగా దీని పై తెలంగాణ హై కోర్ట్ లో వ్యాజ్యం కూడా వేయడం జరిగింది. అయితే నేటి ఉదయం హై కోర్ట్ ఇచ్చిన తీర్పు మేరకు, అటు ఆర్టీసీ యూనియన్లు మరొక్కసారి అలోచించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని, అలానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా సానుకూలంగా వ్యవహరించి ఆర్టీసీ కార్మికుల పట్ల కొంత సామరస్యాన్ని కలిగి ఉండి వారికి న్యాయం చేయాలని తెల్పడం జరిగింది. అయితే ఈమేరకు రేపు ఆర్టీసీ నాయకులతో మరొక్కమారు తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం కనపడుతోంది. 

ఇక ఈ కీలక సమయంలో ఆర్టీసీకి వెనువెంటనే ఒక ఎండీని నియమించాలని  ప్రభుత్వం భావించి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, అకున్‌ సబర్వాల్‌, స్టీఫెన్‌ రవీంద్రలకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు వారిని వెంటనే అందుబాటులో ఉండాలని ఆ ఫోన్ ద్వారా తెల్పడం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని ఆర్టీసీ ఎండీగా నియమించి, వారి ద్వారా ఆర్టీసీ నాయకులకు రాయబారం అందించి, తద్వారా వారి కోరికలను కొంతవరకు తీర్చే విధంగా ఆలోచన చేస్తోందట ప్రభుత్వం. అయితే ఈ ముగ్గురిలో తెలంగాణ ఆర్టీసీ నూతన ఎండీగా ఎవరు ఎంపిక అవుతారు అనేది అతి త్వరలో వెల్లడి కానుందట....!!


మరింత సమాచారం తెలుసుకోండి: