ఏపీ సీఎం జగన్
మోహన్ రెడ్డి మద్యపాన నిషేధంలో భాగంగా..రాష్ట్రంలోని వైన్ షాపులని ప్రభుత్వమే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే దశలవారీగా మద్య నిషేధంలో భాగంగా ఏటా 20శాతం షాపులను తగ్గించేందుకు నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం...ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,380 మద్యం షాపులని 3,500కి తగ్గించి వాటిని ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇక ఏపీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏళ్ల తరబడి ఏపీలో మద్యం వ్యాపారం చేస్తున్న వ్యాపారులు ఇప్పుడు తెలంగాణకు క్యూ కట్టారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక విషయం తెలుసుకున్న ఏపీ మద్యం వ్యాపారులు టెండర్లు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. టెండర్లు వేసేందుకు తెలంగాణ వ్యాపారులతో పాటు పోటీపడుతున్నారు. పైగా షాపుల సంఖ్యని కూడా పెంచడం ఆంధ్రా వ్యాపారులుకు కలిసొచ్చింది. స్నేహితులు, బంధువుల ద్వారా మద్యం టెండర్లు వేయిస్తున్నారు.
ముఖ్యంగా ఏపీలోని కర్నూలు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు బోర్డరులో ఉన్న తెలంగాణ జిల్లాలు ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ లలో టెండర్లు ఎక్కువగా వేస్తున్నారు. అటు హైదరాబాద్ లో కూడా బంధువులు ద్వారా టెండర్లు వేయిస్తున్నారు. అలాగే కొంతమంది సిండికేట్గా ఏర్పడి దరఖాస్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ మద్యం టెండర్ల వల్ల తెలంగాణ సర్కారుకు ఆదాయం బాగా పెరుగుతోంది. దీంతో తెలంగాణ సర్కార్ మాంచి జోష్లో ఉంది.
టెండరు దరఖాస్తు ఫీజు రూ. లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచడం వల్ల ఈ ఆదాయం రెట్టింపు అవ్వనుంది. ఇక ఈ నెల 18న లాటరీ పద్ధతిలో టెండర్లను అధికారులు కేటాయించనున్నారు. కాగా, రాష్ట్రంలో 2,216 మద్య దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి
జగన్ నిర్ణయం వల్ల కేసీఆర్కు ఆదాయం పెరుగుతుంది.