ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా మెదక్ లో మొత్తం 38 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ షాపుల కోసం ఏకంగా 438 దరఖాస్తులు రావడం విశేషం. గతంలో ఒక్కో టెండర్ కు టెండర్ ఫీజు కింద లక్ష రూపాయలు మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. అది నాన్ రిఫండ్ బుల్. కానీ, ఈసారి ఫీజును ఏకంగా రెండు లక్షల రూపాయలు పెంచారు. అంటే గతంలో కంటే డబుల్. అయినా సరే కిక్కు ఏ మాత్రం తగ్గలేదు.
చివరి రెండు రోజుల్లోనే మద్యం షాపుల కోసం అప్లికేషన్లు పోటెత్తాయి. మొత్తమీద తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 43 వేలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్టు ఆబ్కారీ శాఖ తెలిపింది. ఈ అప్లికేషన్ల ద్వారా రాష్ట్రానికి దాదాపుగా రూ. 860 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇన్ని అప్లికేషన్లు వచ్చినా అందులో లాటరీ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు.
రాష్ట్రంలో మొత్తం 2,216 మద్యం షాపులు ఉన్నాయి. ఈనెల 18 వ తేదీన లాటరీ ద్వారా మద్యం షాపులను నిర్ణయిస్తారు. ఇక కెసిఆర్ సొంత జిల్లాలో 38 మద్యం షాపులకు 438 అప్లికేషన్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ 438 అప్లికేషన్ల ద్వారా ప్రభుత్వానికి 9 కోట్ల 80 లక్షల ఆదాయం వచ్చింది. ఈ 438 అప్లికేషన్లలో 50కిపైగా అప్లికేషన్లు మహిళల పేరుమీదనే ఉండటం విశేషం.
ఇక ప్రాంతాలవారీగా తీసుకుంటే .. పొడ్చన్ పల్లి మద్యం దుకాణానికి జిల్లాలోనే అత్యధికంగా 38 దరఖాస్తులు వచ్చాయి, అలాగే మేడ్చల్ కు దగ్గరలోని కాళ్ళకల్ మద్యం దుకాణానికి సైతం 38 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రంగంపేట్ వైన్స్ షాప్ కోసం అతి తక్కువగా 4 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలను అక్కడి ప్రభుత్వమే నిర్వహిస్తుండటంతో.. అక్కడి వ్యాపారులు.. తమ బంధువులు, స్నేహితుల పేరిట తెలంగాణలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఏపీ వ్యాపారులను తెలంగాణాలో అడుగుపెట్టనివ్వకుండా ఉండేందుకు కొంతమంది సిండికేట్ గా ఏర్పడి దుకాణాలు నిర్వహించాలని చూస్తున్నారు.