ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు
జయప్రద తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేసి ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. సమాజ్వాదీ పార్టీ తరఫున బరిలో దిగిన ఆజం ఖాన్ బీజేపీ నేత జయప్రదపై గెలుపొందారు. అయితే, ఎన్నికల సమయంలో ఆజం ఓ ర్యాలీలో ప్రసంగం చేస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎటువంటి లోదుస్తులు వేసుకుంటుందో తనకు తెలుసన్నారు.ఈ వ్యాఖ్యలు రచ్చగా మారాయి. కాగా తనపై కామెంట్లు చేసిన ఆజంఖాన్పై తాజాగా జయప్రద కీలక వ్యాఖ్యలు చేశారు.
సమాజ్వాదీ పార్టీ నాయకుడు అజాం ఖాన్ తాజాగా ఓ ర్యాలీలో మాట్లాడుతూ...కోళ్లు, మేకలు ఎత్తుకెళ్లినట్లు కూడా కేసులు పెడుతున్నారని ఆజం ఏడ్చేశారు.సొంత నియోజకవర్గంలో రాంపూర్లో తనపై సుమారు 80 కేసులు నమోదు అయ్యాయని వాపోయారు. ఆజం ఏడుపుపై మాజీ ఎంపీ జయప్రద స్పందించారు. ఆడవాళ్ల కన్నీటి ఉసురు ఆజంకు తగిలిందని జయప్రద అన్నారు. గతంలో తనను ఓ మంచి నటిగా గుర్తించేవాడని, కానీ ఇప్పుడు ఏమంటున్నాడో తెలుస్తోంది కదా అంటూ జయప్రద విమర్శించారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ఆజంఖాన్ ప్రయత్నించినట్లు జయప్రద ఆరోపించారు. ఆజంకు ఆడవారి కన్నీటి ఉసురు తగిలిందని, అందుకే ప్రతి మీటింగ్లో ఏడుస్తున్నాడని మండిపడ్డారు.
సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా
జయప్రద 2004, 2009లో రాంపూర్ నుంచి పోటీచేసి గెలుపొందారు. కాగా 2014లో రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థిగా బిజ్నోర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. గత లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన జయప్రదపై ఆజం గెలుపొందారు. తీవ్ర వివాదాస్పద వ్యక్తి అయిన ఆజం స్పీకర్ స్థానంలో ఉన్న ఎంపీ రమాదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రమాదేవి చైర్లో ఉన్న సమయంలో ఖాన్ ట్రిపుల్ తలాక్పై మాట్లాడారు. మీరు నాకు ఎంతగా నచ్చారంటే.. మిమ్మల్ని చూస్తుంటే మీ కండ్లల్లో కండ్లు పెట్టి చూడాలని అనిపిస్తుందని ఆజంఖాన్ అన్నారు. అయితే ఆ క్షణమే చైర్లో ఉన్న డిప్యూటీ స్పీకర్ రమాదేవి .. ఎంపీ ఆజం నుంచి క్షమాపణ కోరారు. స్పీకర్తో మాట్లాడే వైఖరి ఇది కాదన్నారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో సభలో రభస మొదలైంది. అనంతరం ఆజంఖాన్ క్షమాపణలు తెలిపారు.