సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం వైఎస్ జగన్ కొత్త పుంతలు తొక్కుతున్నారు. వివిధ రోగాలతో బాధపడేవారికి ఉపశమనం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నారు. సంక్షేమ పథకాల విషయంలో తండ్రిని మించిపోతున్నారు. తాజాగా ఆయన కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పాటు తలసేమియా, హీమోఫిలియా, సికిల్సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రూ.10 వేలు సాయం అందించాని నిర్ణయించారు.
శస్త్ర చికిత్సలు చేయించుకున్న వ్యక్తి కోలుకునేవరకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయి. 150 ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలందించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబర్ 1 నుంచి శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి కోలుకునే వరకు ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 5 వేల కేటగిరిలో మరో నాలుగు వ్యాధులు చేర్చారు. పనిచేయలేని స్థితిలో ఉన్న వారికి రూ.5 వేల పింఛన్ వర్తిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.
ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. బోధనాసుపత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా, నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిసెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. వైయస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని కళాశాల విద్యార్థులకు వర్తింజేయాలని తెలిపారు.వైద్యరోగ్యశాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ జనవరిలో మొదలు పెట్టాలని ఆదేశించారు.