ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ అధినేత పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నట్లు కనిపిస్తుంది. ఓటమి తర్వాత చాలామంది నేతలు బాబుని ఓ రేంజ్ లో తిట్టేసి వైసీపీ, బీజేపీల్లోకి జంప్ అయిపోయారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు బాబు ముందు చేతులు కట్టుకున్న నేతలు...అధికారం కోల్పోగానే బాబుపైనే రివర్స్ అవుతున్నారు. పాత చంద్రబాబు అయితే వాళ్ళని సస్పెండ్ చేసేవారు. కానీ ఇప్పుడు బాబు అలా లేరు. తనని తిట్టిన నేతలనే వాటేసుకునేలా ప్రవర్తిస్తున్నారు.
ఇక ప్రతిపక్ష నేతగా ఉన్న బాబు కూడా హుందాగా అధికార పార్టీ మీద విమర్శలు చేయాల్సింది పోయి...ఏదో ఒక చిన్న నాయకుడిలా విమర్శలు చేస్తున్నారు. ఆఖరికి సోషల్ మీడియా లో కూడా వచ్చే విమర్శలని చదివే స్థాయికి దిగజారిపోయారు. ఇటు పార్టీలో పరిస్తితి ఉంటే, ప్రత్యర్ధ పార్టీలు కూడా బాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఛోటా, మోటా నాయకులు సైతం బాబుని ఏకీపారేస్తున్నారు.
ఆఖరికి జివిఎల్ లాంటి వారు కూడా బాబు విషయంలో పంచాయితీ చేస్తానని చెప్పేంత చీప్ అయిపోయారు. అస్సలు చంద్రబాబు రాజకీయ జీవితం ఏంటి? బీజేపీ ఎంపీ జివిఎల్ రాజకీయ జీవితం ఏంటి? చంద్రబాబు వాజ్ పేయి, అద్వానీ లాంటి నేతలతో కలిసి రాజకీయం చేసిన బాబు లాంటి వారి కోసం అవసరమైతే తాను మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పి జివిఎల్ కూరలో కరివేపాకు లాగా తీసిపారేశారు.
ఇటీవల బాబు బీజేపీకి దూరమై నష్టపోయామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై బిజేపి నేతలు స్పందిస్తూ, బాబు మళ్ళీ మాకు దగ్గరవ్వాలని చూస్తున్నారని, ఆయనకు గేటులు మూసేసమంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా జివిఎల్ కూడా స్పందించారు. అన్నీ కోల్పోయిన టీడీపీతో కలవడం వల్ల బీజేపీకి నష్టమేనని వ్యాఖ్యానించారు. ‘అవసరమైతే చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానంటే.. నేను మా అధిష్టానం నాయకులతో మాట్లాడతా’నని అన్నారు.
ఈ వ్యాఖ్యలని బట్టి చూస్తుంటే జివిఎల్ పంచాయతీ చేసే స్థాయికి చంద్రబాబు రాజకీయం దిగజారిపోయిందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఆ పైగా విలీనం అంటూ చంద్రబాబు పరువు తీసేసేలా మాట్లాడారు. ఏదేమైనా మాట మాటకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు
ప్రతిష్ట రోజురోజుకూ దిగజారిపోతున్నట్లు కనిపిస్తోంది.