అవును జగన్మోహన్
రెడ్డి నోరు విప్పాల్సిన సమయం వచ్చింది ఇపుడు. ఏబిఎన్ రాధాకృష్ణ తన కొ(చె)త్త
పలుకులో ఓ సంచలన విషయం బయటపెట్టారు. తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిస్తే
జూబ్లిహిల్స్ చెక్ పోస్టు ఏరియాలో ఖరీదైన స్ధలాన్ని ఇప్పిస్తానంటూ తండ్రి
వైఎస్సార్ సిఎంగా ఉన్న కాలంలో స్వయంగా
జగనే తనకు రాయబారం పంపారంటూ రాధాకృష్ణ తన కాలంలో బయటపెట్టారు. అయితే ఆ రాయబారాన్ని
తిరస్కరించినట్లు కూడా చెప్పుకున్నారు లేండి.
ఇక్కడ ఏబిఎన్ ఎండి చెప్పదలచుకున్నదేమిటంటే తాను నిఖార్సైన జర్నలిస్టునని. తాయిలాలతో తనను ఎవరూ వశపరుచుకోలేరన్న విషయం లోకం గుర్తించాలన్న తాపత్రయమే ఇక్కడ కనబడుతోంది. కథనం చదివిన తర్వాత వైఎస్సార్ అంతటి శక్తివంతునికే తాను లొంగలేదు కాబట్టి ఆయన కొడుకు ఆఫ్ట్రాల్ జగన్ అంటే తనకు లెక్కేమిటి ? అన్నట్లే ఉంది.
తనకు తాను నిప్పునని ఏబిఎన్ ఎండి సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చంద్రబాబునాయుడు తన భుజాన్ని తాను చరుచుకున్నట్లే ఉంది రాధాకృష్ణ ఇచ్చుకున్న సర్టిఫికేట్ కూడా. సరే తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకునే క్రమంలో జగన్ ను కూడా పిక్చర్లోకి లాగారు. కాబట్టి తన కొ(చె)త్తపలుకులో రాధాకృష్ణ చెప్పింది నిజమో కాదో తేల్చి చెప్పాల్సిన బాధ్యత ఇపుడు జగన్ మీద పడింది.
అసలే జగన్-రాధాకృష్ణ మధ్య వ్యవహారం మొదటి నుండి ఉప్పు-నిప్పు లాగుందన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబును బ్రహ్మాండమని లోకానికి చాటి చెప్పటానికి ప్రతి విషయంలోను జగన్ ను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం జగన్ పై ఇదే విధంగా కథనాలు వండివర్చారు.
ఎల్లోమీడియా చంద్రబాబుకు ఎంతగా జాకీలేసినా జనాలు టిడిపి గూబగుయ్యిమనిపించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి జగన్ అంటే చంద్రబాబే కాదు రాధాకృష్ణ కూడా మండిపోతున్నారు. తాను నిప్పునని ఏబిఎన్ ఎండి ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చుకున్నా మీడియా రంగంతో పాటు మామూలు జనాలు కూడా నమ్మరన్న విషయం తెలుసుకోవాలి.