ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి చెందిన పలువురు సిట్టింగ్‌లు, ముఖ్య, కీలకనేతలు ఆ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్నిక‌లు ముగిసిన నాలుగు నెల‌ల్లోనే ఎంతోమంది టీడీపీ కీల‌క నేత‌లు, ద్వితీయ శ్రేణి నేత‌లు ఇత‌ర పార్టీల్లోకి మారిపోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మ‌రో మాజీ మంత్రి కూడా ఇప్పుడు బీజేపీలో చేరిపోయారు.  ఏపీ మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. సోమవారం ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆది కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కండువా కప్పిన నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.


ఆదినారాయణరెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయ‌న 2004, 09 ఎన్నిక‌ల్లో సైతం కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అనంతరం టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారు. టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపులో కీలకంగా వ్యవహరించారు.


ఇక టీడీపీలో చేరాక ఆదికి మ‌రో మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డికి మ‌ధ్య వైరం ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చారు. ఈ క్ర‌మంలోనే రామ‌సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే...  2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరిగింది.


ఇటీవలి కాలంలో బీజేపీలో చేరేందుకు ఓసారి ఢిల్లీ వెళ్లారు. కొన్ని కారణాల వల్ల అప్పట్లో జాయిన్‌ కాలేదు.. అయితే సోమవారం నాడు ఢిల్లీ వేదికగా జేపీ నడ్డా సమక్షంలో ఆది కాషాయ కండువా కప్పేసుకున్నారు. కాగా కడప జిల్లాలో టీడీపీ కీలకనేతగా ఉన్న ఆది బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి షాక్ తగిలినట్లైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: