అనంతపురం జిల్లా టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ ప్రత్యేకతే వేరు. మనసులో ఏమున్నాదాచుకోకుండా జనం ముందు చెప్పేస్తూ తరచూ కాంట్రావర్సీ అయిపోతుంటారు. అందుకే  మీడియా ఎప్పుడూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వెంట పడుతుంటుంది. ఆయన నోరు విప్పితే ఏదో ఒక వార్త దొరుకుతుంది కదా.. అని ఎదురు చూస్తుంటుంది.

ఇప్పుడు ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి సెన్సేషన్ విషయంలో ఆయన్ను మించిపోయినట్టున్నాడు. సంచలన కామెంట్లు చేస్తూ హడావిడి చేసేస్తున్నాడు. అన్న కంటే ఈయన ఓ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నాడు. అందుకే ఏకంగా మీడియాను కూడా సవాల్ చేసేస్తున్నాడు. లేటెస్టుగా ఆయన కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటున్నానని బహిరంగంగా సవాల్ చేసి మరీ చెప్పడం కలకలం రేపింది. 

లంచాలు  తీసుకొని తన తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేశారు. గతంలో కాంట్రాక్టర్లు పర్సెంటేజీలు ఇస్తే తీసుకునేవాడిని కాదని... కానీ ఇప్పుడు తానే అలా తీసుకోవడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం లంచాలు డీడీల రూపంలో తీసుకుంటున్నానని.. ఈ డబ్బు తన జేబులో వేసుకోవడం లేదని.. ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నానని రాబిన్ హుడ్ తరహాలో బిల్డప్ ఇచ్చారు. 

అంతేకాదు.. లంచాలు తీసుకోకపోతే.. నియోజక వర్గ అభివృద్దికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని విలేకరులనే దబాయించాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర డబ్బులేదని అందుకే తాను లంచాలు తీసుకుంటున్నానని చెప్పాడాయన. అంతేకాదు.. ఈ లంచాల సొమ్ముకు ఆడిటింగ్ కూడా చేయిస్తాడట. మీడియా వాళ్లు ఈ విషయం దమ్ముంటే రాసుకోండి.. అడగటానికి ఎవరొస్తారో రమ్మనండి అంటూ బహిరంగంగానే సవాల్ చేశారు. మొత్తానికి నియోజకవర్గాల అభివృద్ధికి జేసీ కొత్త ఫార్ములా కనిపెట్టారన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: