గత రెండువారాలుగా ఓయూ లో బీఫ్ పెస్టివల్ పై జరుగుతున్న రగడ ఇంతా అంతా కాదు. ఆహారపు అలవాట్లపై మరోకరి పెత్తనం ఏంటనీ పలువురు విద్యార్ధి సంఘాలు వారిస్తున్నారు. ఇందు కోసం వారు పెద్దకూర పండగ నిర్వహిస్తున్నారు. అయితే ఈ బీఫ్ పెస్టివల్ చినికి చినికి గాలి వానగా మారింది. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతిపాదించిన ఆదేశిక సూత్రాలకు.. కల్పించిన హక్కులకు నిత్యం విఘాతం కలుగుతూనే ఉంది. అరవయేళ్ల స్వాతంత్ర్య దేశంలో ఎవరికి నచ్చిన తిండిని వారు తినడానికి కూడా అనుమతులు తీసుకోవాలని.. అనుమతుల లేవని చెప్పడం విషాదం. ఈ నేపథ్యంలోనే పెద్దకూర పండుగ మరోసారి వివాదస్పదంగా మారింది. గత రెండు, మూడేళ్లుగా చిన్నపాటి అలజడితో ముగిసిన బీఫ్ ఫెస్టివల్.. ఈ సారి మాత్రం దాద్రి ని తలపిస్తుంది. ఎప్పటిలాగే బీఫ్ ఫెస్టివల్ ని నిర్వహించడానికి ఉస్మానియా విద్యార్ధులు ఐక్యంగా ముందుకు కదిలారు. బీజేపీ అనుబంధ విద్యార్ధి సంఘం ఏబీవీపీ మినహా 25 విద్యార్ధి సంఘాలు డీసీఎఫ్ గా ఏర్పడ్డాయి.
ఆత్మగౌరవ సాంస్కృతిక ఉద్యమం.
ఇకపోతే ఓయూ లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో నాగార్జున యూనివర్శిటిలోని ఈ బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. ఇంత మంది విద్యార్ధి సంఘాలు కలిసి బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహించాలనడం వెనకాల ఒక ఉమ్మడి పోరాటం దాగి ఉంది. ఆదే ఆత్మగౌరవ సాంస్కృతిక ఉద్యమం. ఈ దేశంలో మూడువేల యేండ్లు గా మనువాద కుల వ్యవస్థ దళితులను అంటరానివాళ్లుగా వెలివాడలకు పరిమితం చేసింది. ఆధునిక కాలంలో కూడా మనువాదం మరోసారి రాజ్యాధికారాన్ని చేపట్టి దళితుల, మైనారిటీల ఆహారపు హక్కును కాలరాస్తున్నది.
కవులు, రచయితలను, సామాజిక కార్యకర్తలను మట్టుపెట్టి హిందు యేతర శక్తులన్నింటినీ భయభ్రాంతులకు గురిచేసింది. ఇక బీఫ్ బ్యాన్ ను మహారాష్ట్ర హర్యానా వంటి రాష్ట్రాల్లో అధికారికంగానే అమలు చేసింది. ఇలా హిందుత్వశక్తుల దాడులకు నిరసనగా రచయితలు వారి అవార్డులను తిరిగి ఇచ్చారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోమత అసహనం పై హైదరాబాద్ కేంద్రంగా హిందుత్వ వ్యతిరేక సెక్యులర్ శక్తులు ముక్తకంఠంతో అసహన పరిస్థితులను ఖండించాయి.
దీంతో బీజేపీ అనుబంధ హిందుత్వ శక్తులు సందిగ్దంలో పడ్డాయి. ఓయూ లో జరుపుతున్న బీఫ్ పెస్టివల్ అడ్డుకునేందుకు ప్రయత్నాలు తీవ్ర తరం చేశాయి. ఏట్లాగు కేంద్రంలో తమ పార్టీయే అధికారంలో ఉంది. ఒక హద్దేమిటన్నట్లు రెచ్చిపోయాయి. బహిరంగంగానే దాడులు చేస్తామని.. పెద్దకూర పండుగ నిర్వాహకుల అంతుచూస్తామంటూ ప్రకటించాయి. ఈ ప్రకటించిన వారిలో బాధ్యతాయుతమైన ఒక ప్రజా ప్రతినిధి అయిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉండటం గమనార్హం. కత్తి పట్టుకొని ఫోటోలు దిగి గోసంరక్షణ అని పోస్టర్లు వేయించడం గమనించదగిన విషయం. అంతేకాకుండా మరోవైపు మీడియా కేంద్రంగా ఓయూ విద్యార్ధులకు.. హిందుత్వ శక్తులకు జరిగిన రగడ కూడా దేశ వ్యాప్తంగా ఉన్న వేడిని మరింత రాజేసింది. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోనే గోవధ చట్టముందని వితండవాదం చేశారు. నిజానికి బాబా సాహెబ్ అంబేద్కర్ తన రచనలలో భారతదేశ చరిత్రను గురించి అనేక సూత్రాలు రాశారు. అందులో గోభక్షణ గురించి హిందూ పురణాలు ఏమి చెప్పాయో బట్ట బయలు చేశాడు.
గోవును భక్షించిన సంస్కృతి ఈ దేశంలో వేలయేండ్లు గా ఉంది. ఆవులను చంపి విదేశాలకు ఎగుమతి చేసే భారీ పరిశ్రమలు కలిగిన బీజేపీ నాయకులు గోసంరక్షణ నినందించడం ఇందుకు పరాకాష్ట. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ బీఫ్ తినాలంటే పాకిస్థాన్ పొమ్మనడం కూడా విస్మయం కలిగించింది. ఒకనాడు ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే అని నిర్భంధం పెట్టిన హిందుత్వ వాదులు, ఇవాళ బీఫ్ కోసం దేశం విడిచిపెట్టి పొమ్మనడం ఆహారపు హక్కును కాలరాయడమే అవుతుంది. అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. భారత రాజ్యాంగ ప్రకారం ఎవరికి నచ్చిన మతంలో వారు ఉండొచ్చు . అలాగే ఎవరికి నచ్చిన ఆహారం వారు తినొచ్చు. అది రాజ్యాంగం కలిపించిన హక్కు. ఆ హక్కు ను కాలరాయడం ఇవాళ అధికారికంగా జరుగుతోంది. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్ ను మరింత వివాదస్పదం చేయడంలో హిందుత్వ శక్తులకు టీఆర్ఎస్ సర్కార్ కూడా వత్తాసు పలికింది. ఈ వత్తాసు వెనుక ఓట్ల రాజకీయం ఉంది. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు.
ఓ వైపు కాంగ్రెస్, టీడీపీ ప్రజా ప్రతినిధులను చేర్చుకుంటూనే... మరోవైపు బీజేపీ తో అటంకం కలిగించడానికి సిద్దమయ్యారు. ఈ కుట్ర లో భాగంగానే డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కడీయం శ్రీహరితో బీప్ పెస్టివల్ కు అనుమతి లేదని చెప్పించారు కేసీఆర్. గ్రేటర్ లో తెలంగాణ ఉద్యమ సమయంలోనే బలహీనంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ, గ్రేటర్ ఎన్నికల కోసం బీఫ్ తినే హక్కును కాలరాయడం దిగదుడుపు రాజకీయమే అవుతుంది. ఓట్ల కోసం.. మేయర్ సీట్ల కోసం రాజ్యాంగం కలిపించిన ఆహారపు హక్కును కాలరాయడం తగదు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని చేయని.. మాట తప్పిన తీరుకు ఇది కొన సాగింపు. పైగా ఇదే సమయంలో సీఎం కేసీఆర్ చండీయాగాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకుడు ఒక్క మతానికే కొమ్ముకాస్తు యాగాలు చేయడం దళిత, బహుజనులను అవమానించడమే అవుతుంది. అందుకే కేసీఆర్ సర్కార్ క్రమంగా దళిత, బహుజన వ్యతిరేకంగా మారుతుంది.
దాద్రిలో ఆక్లాక్ హత్య పథకం ప్రకారం జరిగింది. ఉస్మానియాలో కూడా అది పునరావృతమైంది. ఇక్కడ ఆక్లాక్ లేకపోవచ్చుగానీ.. అంతకు మించిన హక్కుల హరింపు మూకుమ్మడిగా జరిగింది. యూనివర్శటీ అధికారులు కూడా తెలంగాణ సర్కార్ సన్నాయి కి తలూపడం విద్యార్థులు ఎప్పటికీ మరిచిపోలేని విషయం. మరోవైపు స్వయంగా టీఆర్ఎస్ సర్కార్ బలగాలను దింపి ఉస్మానియా లో అప్రకటిత కర్ప్యూ విధించి, అరెస్టులు చేయించింది. మరోసారి ఓయూను తెలంగాణ సర్కార్ ఉద్యమ రణరంగంగా మార్చింది. ఇక్కడ బీఫ్ ఫెస్టివల్ జరిగినా.. జరగకపోయినా నైతికంగా గెలిచింది మాత్రం విద్యార్ధులే. బీఫ్ ఫెస్టివల్ కారణంగా అనేక మంది ముసుగులు తొలగిపోయాయి.