జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నేరవేర్చేందుకు తెలంగాణ సర్కార్ పావులు కదుపుతుంది. పాత్రికేయుల కోసం డబుల్ బెడ్ రూం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించిందని పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. జర్నలిస్టుల అభివృధ్ధి, సంక్షేమ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సర్కార్ కు ఉద్యోగులతో స్నేహం ఎలా ఉందో... జర్నలిస్టులతోనూ అలాగే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఏ ఆలోచన చేసినా పెద్దగా చేస్తారని అభిప్రాయపడ్డారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో కూడా అందరికి కార్డులు ఇస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సావనీర్ ను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ స్వయంగా జర్నిలిస్టుల నాయకులు, మీడియా ప్రతినిధులతో రెండు సార్లు సమావేశమై జర్నలిస్టుల గృహ నిర్మాణం పై చర్చించారన్నారు.
హైదరాబాద్ లోని సోమాజి గూడ ప్రెస్ క్లబ్ జర్నిలిస్టుల సంక్షేమం కోసం రూ.25 లక్షల కార్పస్ ఫండ్ ను సమకూర్చుకోవడం అభినందనీయ మన్నారు. మరో రూ. 25 లక్షల సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మొత్తం రూ. 50 లక్షల నిధులతో జర్నిలిస్టుల కోసం భారీ ప్రాజెక్టును తలపెడితే... క్లబ్ కార్యవర్గం, జర్నలిస్టులు సహకరించాలని కోరారు. వృతి పరంగా జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ఒక్కటేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. జర్నలిస్టులందరికీ సంక్షేమ కార్యక్రమాలను అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. మొత్తం రూ. 100 కోట్ల ఫండ్ గా తయారు చేసి, జర్నలిస్టులకు పెన్షన్ లాగా ఇచ్చే ప్రయత్నం చేయనున్నట్లు ప్రకటించారు. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించినట్లు చెప్పారు. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ లో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించనట్టు తెలిపారు. బుద్వేల్ లో ఇండ్ల నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని మంత్రి తెలిపారు.