తమిళ పురచ్చి తలైవీ మరోసారి సీఎం బాధ్యతలు చేపడుతుందా? అన్న చర్చ ఇప్పుడు తమిళ నాట రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. మారుతున్న సమీకరణాలో అటు జయలలిత జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. వరుసగా రెండో సారి అధికారం రావాలంటే రాజకీయ సమీకరణాలు మార్చేయాలి. జనానికి తామే బెటర్ అని నిరూపించుకోవాలి. అప్పుడే తమిళనాడు లో వరుసగా రెండో విజయం వరిస్తుందని జయలలిత వ్యూహాలు పన్నుతున్నారు. అయితే తమిళనాడు ఓటర్లు ఓసారి డీఎంకే కు, మరోసారి అన్నాడీఎంకే కు పట్టం కట్టే సంప్రదాయాన్ని అలవాటు చేసుకున్నారు. ఈ సారి మాత్రం దాన్ని బ్రేక్ చేయాలన్న పట్టుదలతో జయలలిత ఉన్నారు. విజయ్ కాంత్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా అంచనా వేసుకుంటున్నారు.
తమ పార్టీలోనూ బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తు చేస్తున్నారు. లాబీయింగ్ చేస్తూ తమ వారికే టిక్కెట్లు ఇప్పించాలని కోరుకుంటున్న వారికి ఆదిలోనే చెక్ పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సొంతంగా ఎదిగేందుకు తన వర్గానికే టిక్కెట్లు దక్కేలా ప్లాన్ చేయడాన్ని పసిగట్టారు. అంతేకాకుండా సెల్వంను కడిగిపారేసినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. కింగ్, కింగ్ మేకర్ అంటూ జయలలిత టార్గెట్ గా విజయ్ కాంత్, అతడి భార్య చేసిన వ్యాఖ్యలను జయ సీరియస్ గా తీసుకున్నారు. ఆ కామెంట్స్ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే డీఎండీకే కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. దీంతో విజయ్ కాంత్ విపక్ష నేత హోదా సైతం కోల్పోయారు. ఇదంతా జయలలిత ఎఫెక్టే అన్నది బహిరంగ రహస్యమన్న వాదనలున్నాయి.
మరోవైపు సమథువా మక్కల్ కచ్చి పార్టీ అధినేత, నటుడు శరత్ కుమార్ అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితో తో భేటీ కావడం, అన్నాడీఎంకే కూటమికీ తమ మద్దతు ప్రకటించడం వంటి పార్లర్ గా జరిగిపోయాయి. గతంలో అన్నాడీఎంకే తో దోస్తీ కి గుడ్ బై చెప్పారు శరత్ కుమార్. అయితే తాజా రాజకీయ పరిణామాల నేఫథ్యంలో శరత్ కుమార్ మళ్లీ అన్నాడీఎంకే కూటమితో జతకట్టారు. ఇదంతా జయలలిత ప్రభావమే నని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సీఎం బాధ్యతలు చేపట్టేందుకు జయలలిత పావులు కదుపుతోంది.