తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గడిచిన రెండేళ్లలో రెండు దఫాలుగా మంత్రుల శాఖలను మార్చారు. గతంలో డిప్యూటీ సీఎం, వైద్యశాఖ మంత్రి గా ఉన్న తాటికొండ రాజయ్య పూర్తిగా మంత్రి వర్గంలో నుంచి తీసివేశారు. తాజాగా మరో సారి మార్పులు చేసినా, ఈ సారి మాత్రం ఏ మంత్రికి పెద్దగా నష్టం లేకపోయినా అనుకున్న శాఖ కంటే వేరే శాఖ ను బదిలీలు మాత్రం జరిగాయి. అయితే ఈ మార్పుల ద్వారా కేసీఆర్ హెచ్చరికలు చేయడంతో పాటు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పనులు చేయని మంత్రులకు ఉద్వాసన పలుకుతూనే హెచ్చరికలతో పాటు తన తనయుడు, మంత్రి కే తారక రామారావు కు క్రమంగా పార్టీలో , ప్రభుత్వంలో ప్రాధాన్యత పెంచుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పరోక్షంగా పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్ టూ కేటీఆర్ అని చెప్పినట్టుగా భావించవచ్చునని అంటున్నారు.
జూపల్లి కృష్ణారావుల పైన కేసీఆర్ అసంతృఫ్తి
అయితే మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావుల పైన కేసీఆర్ అసంతృఫ్తి తో ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కి కేసీఆర్ గట్టి ఝలక్ ఇచ్చారనే చెప్పొచ్చు. వాణిజ్య పన్నుల శాఖ ను తలసాని నుంచి లాక్కున్నారు. సినిమాటో గ్రపీ మంత్రిగానూ పనిచేస్తున్నప్పటికీ, వాణిజ్య పన్నుల శాఖ అత్యంత కీలకమైనది. ఈ శాఖ పై తలసాని పనితీరు పై అసంతృప్తి తో ఉన్నారన్న వాదనలు ఉన్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి లాగేసుకున్న వాణిజ్య పన్నుల శాఖను కేసీఆర్, తన వద్దే పెట్టుకున్నారు. అంటే, ఇక్కడ మేటర్ ఎంటంటే.... వాణిజ్య పన్నుల శాఖను తలసాని సమర్ధవంతంగా నిర్వహించలేకపోతున్నారనే సంకేతాలను కేసీఆర్ పంపారు. ఇది, పూర్తిస్థాయిలో సీనియర్ పొలిటీషియన్ అయిన, గతంలోనూ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ని అవమానించడమేనని తలసాని సన్నిహితుల వాదన. అంతగా ప్రాధాన్యత లేని డెయిరీ డెవలప్ మెంట్, పశు సంవర్ధక శాఖ, ఫిషరీస్ శాఖలను తలసానికి అంటగట్టారు కేసీఆర్.
తలసాని శ్రీనివాస్ యాదవ్
అయితే 2014 ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ గుర్తు మీదే ఎమ్మెల్యేగా సనత్ నగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్కీ, ముఖ్యంగా మంత్రి పదవికి ఎట్రాక్ట్ అయిన తలసాని, టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. ఇప్పుడేమో, మంత్రి పదవిలోనే ఉన్నా, శాఖల పరంగా డిమోషన్ కి గురయ్యారు. అంతేకాకుండా కొడుక్కి ప్రమోషన్ ఇచ్చి, తనను డిమోట్ చేయడాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఆయన సన్నిహితులు గుస్సా అవుతున్నారు. తప్పదు మరి, సర్దుకు పోవాల్సిందే... తెలంగాణ లో అసంతృప్తికి తావులేదు. అసంతృప్తి ఏదన్నా వస్తే, కేసీఆర్ ట్రీట్ మెంట్ ఇంకోలా ఉంటుంది. ఇకపోతే సర్వేల ఆధారంగా కేసీఆర్ శాఖలు మార్చినట్టుగా తెలుస్తోంది. మంత్రి తలసాని వాణిజ్య పన్నుల శాఖ విషయంలో ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారని అంటున్నారు. ఇది కూడా తప్పించడానికి కారణమని భావిస్తున్నారు.
టీఎస్ ఐపాస్
ఇక మరో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా టీఎస్ ఐపాస్ విషయంలో వేగంగా పనిచేయడం లేదని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే దాని నుంచి తప్పించి మరో శాఖ ఇచ్చారని భావిస్తున్నారు. ఇక గులాబీ బాస్ తనయుడు కేటీఆర్ కు కీలక శాఖల అప్పగించారు. ప్రభుత్వానికి భారీగా రాబడి ఉన్న, హైదరాబాద్ లేదా రాష్ట్ర అభివృద్దికి కీలకమైన పరిశ్రమల శాఖను కూడా అప్పగించారు. హరీష్ రావు వద్దని చెప్పిన శాఖను కూడా కేటీఆర్ కే అప్పగించారు. తద్వారా పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్ నెంబర్ టూ అని కేసీఆర్ చెప్పకనే చెప్పారని అంటున్నారు. ఈ క్రమంలో హరీష్ రావు ను క్రమంగా పక్కకు తప్పిస్తున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. మైనింగ్ శాఖను అయనే వద్దన్నారా లేక తీసుకున్నారా అనే చర్చ కూడా సాగుతుంది. సీఎం స్థాయి తరువాత కీలక శాఖలన్నీ కేటీఆర్ కు అప్పగిస్తూనే నెంబర్ టూ అని చెప్పకనే చెప్పారన్న వాదనలు గట్టిగానే వినబడుతున్నాయి. మరికొన్ని శాఖల మార్పులకకు అవకాశం వచ్చే జూన్ నాటికి కేసీఆర్ పాలన రెండేళ్లు పూర్తవుతుంది.
అప్పటికి మరికొన్ని శాఖల మార్పులు తప్పవని తెలుస్తోంది. ఇందుకు మంత్రులు తలసాని, జూపల్లి ల ద్వారా హెచ్చరించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇకపోతే జూన్ నాటికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందా ? అన్న ప్రశ్న కు దాదాపుగా సమాదానం దొరికి నట్టేనని పలువురు భావిస్తున్నారు. అయితే ఇందులో చాలా మంది ఆశావాహులు ఉన్నా, వారికి ఈ సారి నిరాశే మిగిలింది. తెలంగాణలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని చాలా మంది భావించినా, సీఎం కేసీఆర్ మాత్రం మార్పులతో సరిపెట్టారు. అయితే మరి పార్టీ ప్లినరీ ఉన్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన అభ్యర్థులను పరిస్థితి ఏంటానీ ఆశక్తి నెలకొంది. మంత్రి వర్గ విస్తరణ చేస్తారా లేదా, ఈ సారి మార్పులతో కానిస్తారా చూడాలి మరి. ఒకవేళ మంత్రి వర్గ విస్తరణ జరిగితే ఈ సారి మహిళలకు అవకాశాలు రావొచ్చంటున్నారు. కానీ మహిళల విషయం లో ఇంత వరకు కేసీఆర్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా కేసీఆర్... మంత్రులకు హెచ్చరికలతో పాటు కేటీఆర్ నెంబర్ టూ అని చెప్పాడని భావిస్తున్నారు.
అయితే ఓరాల్ గా ఐదుగురు మంత్రులకు సంబంధించిన శాఖల్లో మార్పులు చేర్పులు చేసిన కేసీఆర్, తన కుమారుడికి పవర్ ని మరింత పెంచారు. పరిశ్రమలు, మైనింగ్, ఎన్ఆర్ఐ శాఖలని కేసీఆర్ , తన పుత్రరత్నం కేటీఆర్ కి అప్పగించడం నిజంగా గమనించదగ్గ విషయమే. కుమారుడికి కొత్త పవర్స్ ఇచ్చి, ఇద్దరు మంత్రులకు ఉన్న పవర్స్ ని కేసీఆర్ లాగేసుకోవడం పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.