దేశంలోనే ఎక్కువగా కష్టపడతాడని పేరున్న ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబు. అలాంటి చంద్రబాబు ఏడాదంతా పని చేసి.. వేసవిలో మాత్రం విదేశీ పర్యటన చేస్తారు. ఇది ప్రతి ఏటా జరిగేదే.. ఈసారి కూడా అలాగే ఫ్యామిలీతో థాయ్ లాండ్ వెళ్లారు. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. కానీ చంద్రబాబు విదేశీ యాత్రలకు వెళ్లింది రిలాక్సింగ్ కోసం కాదట.
చంద్రబాబు విదేశీయాత్రల వెనుక అసలు సీక్రెట్ వేరే ఉందట. ఏపీకు ప్రత్యేక హోదా లేదనే కేంద్ర వైఖరి తేటతెల్లమవుతోందని.. ఈ విషయంలో టీడీపీపై రాష్ట్రమంతటా ఆగ్రహం వ్యక్తమవుతుందని చంద్రబాబుకు ముందే తెలుసట. అందుకే ఆ ఆగ్రహాన్ని తప్పించుకునేందుకే బాబు ఈ సమయంలో ఫారిన్ టూర్ వెళ్లారట. ఇదీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చెబుతున్న వ్యాఖ్యానం.
బాబుది నయవంచన..
ప్రత్యేక హోదా కావాలని ప్రజలు చేస్తున్న ఆగ్రహాజాల్వల నుంచి తప్పించుకోవడానికే బాబు విదేశీ యాత్రలకు వెళ్లారని భూమన అంటున్నారు. బాబు మోడీ ప్రభుత్వానికి లొంగిపోయారని విమర్శించారు. ఓ పక్క వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు ఎమ్మెల్యేలను ఎలా కొందామా అన్న ధ్యాసలో ఉండడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
ఓటుకు నోటు కేసులో జైలుకు పోవాల్సి వస్తుందన్న భయంతో ప్రత్యేక హోదా అవసరం లేదని మాట్లాడుతున్న బాబు కంటే.. నయవంచకుడు ఎవరూ ఉండరని భూమన అంటున్నారు. చంద్రబాబు తన కుల దైవమైన వెంకటేశ్వరస్వామి పాదపీఠికల సాక్షిగా తిరుపతిలో 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని నరేంద్ర మోదీకి వినతి పత్రం సమర్పించారని, అధికారంలోకి వచ్చాక హోదాను విస్మరించారని మండిపడ్డారు.