ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు మరో కొత్త వివాదంలో ఇరుక్కుంటున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి దాన్ని అమలు చేయడంో నానా తంటాలు పడుతున్న ఆయన.. ఇప్పుడు ఏకంగా కాపు నాయకులను అవమానిస్తున్నారన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాపుల కోసం భవనాలు నిర్మించాలని నిర్ణయించిన సర్కారు వాటికి చంద్రన్న కాపు భవనాలు అని పేరు పెట్టడమే ఇందుకు కారణం..
కాపు భవనాలకు చంద్రన్న కాపు భవనం అని పేరు పెట్టడం కాపులను ఘోరంగా అవమానించడమే అంటున్నారు వైసీపీ నేతలు. కాపుల్లో పుట్టిన మహానేతలు ఎందరో ఉండగా బాబు ఆయన పేరునే పెట్టుకోవడంలో అంతర్యం ఏమిటని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. కేవలం ప్రజల్ని మభ్య పెట్టేందుకే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నట్లు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.
కాపుల భవనానికీ చంద్రన్న పేరేనా..?
కాపుల్లో కోడి రామామూర్తినాయుడు, కన్నగంటి హనుమంతు, ఎస్వీ రంగారావు, సీకే నాయుడు, మహానటి సావిత్రి, వంగవీటి మోహనరంగారావు వంటి ఎందరో ఆణిముత్యాలున్నా, కాపు భవనాలకు బాబు పేరు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా చంద్రబాబు పైన చెప్పిన వారందరినీ అవమానిస్తున్నారని అంబటి ఆరోపిస్తున్నారు.
ముద్రగడ పద్మానాభం ఆగస్టు 21న లేఖ రాయడం వల్లే కాపులను బీసీల్లో చేర్చే విషయంపై మంజూనాథ కమిషన్ ను జనవరి 18, 2016లో వేశారని, ఇప్పటికి ఆ కమిషన్ పని చేసిన దాఖాలాలు ఎక్కడ కనిపించడం లేదని అంబటి విమర్శించారు. కాపు కార్పొరేషన్లు ఏర్పాటు చేయకుండా, కాపులను బీసీలో చేర్చకుండా బాబు మీనమేషాలు లెక్కిస్తున్నారని అంబటి మండిపడ్డారు. నిజమే.. కాపు భవనాలకు కూడా చంద్రబాబు పేరు పెట్టడం కాస్త ఓవర్ అయినట్టే లేదూ..!