నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనకు రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆయన ను చూసి గర్వపడాలా లేక జాలి పడాలా అర్ధం కాని పరిస్థితి. ఒకప్పుడు ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు పదమూడు జిల్లాలతో కూడిన చిన్న రాష్ట్రాన్ని పాలించడం నిజానికి ఒక లెక్కలోనిది కాదు. కానీ అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు ఆయన చెప్పిందే వేదం చేసిందే నాదం గా ఢిల్లీ పెద్దలు ఉండే వారు. కంటి చూపుతో ఢిల్లీ ని శాసించారు. కానీ ఇప్పుడు ఆయనను ఢిల్లీ లో పట్టించుకునే నాదుడే లేడు. కనీసం ఆయనకు రావలసిన బడ్జెట్ ను సైతం తీసుకు రాలేని పరిస్థితి. అయితే ఘటనా ఘటన సమర్ధుడైన రాజకీయ నాయకుడిగా పేరున్నచంద్రబాబుకు ఆ పేరు నిలబెట్టుకోవడానికి దొరికిన ఆపూర్వ సువర్ణావకాశం నవ్యాంధ్ర ప్రదేవశ్ నూతన రాజధాని నిర్మాణం. స్వతంత్ర భారత చరిత్రలో తాను కోరుకున్న విధంగా రాజధాని నగర నిర్మాణం చేసుకోగల వెసులు బాటు లభించిన ముఖ్యమంత్రి ఈయన ఒక్కరే. అది అందరికి రాని అదృష్టం.
ప్రత్యేక హోదా ఆంశం ముదిరి పాకన పడుతుంది....
అయితే, ఈ క్రమంలో అన్నీ అవరోధాలే, అన్నీ అడ్డంకులే, కొన్ని ఇతరులు చేసిన పుణ్యమైతే, కొన్ని స్వయంగా తెచ్చిపెట్టుకున్నవి. ఏదీ అనుకున్నట్లుగా కలిసి రావడంలేదు. కేంద్రం నుంచి ఆశించిన సాయం దొరకడం లేదంటూ పాలక పక్షం వాళ్ళే ప్రతి రోజూ టీవీ చర్చల్లో చెబుతున్నారు. కాదు ఇందులో నిజం లేదు. దోసిళ్ళ కొద్దీ మేము చేస్తున్న సాయం కళ్ళకు కనబడటం లేదా అని మిత్ర పక్షం బీజేపీ లెక్కలు చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏలా ఉందంటే...కాళ్ళూ కట్టేసి కబడ్డీ మైదానంలో దింపిన చందంగా ఉంది. రాజధానికి తోడు ప్రత్యేక హోదా అంశం. ఇది రోజు రోజుకూ ముదిరి పాకాన పడుతోంది. ప్రతిపక్షాలకు ఒక ఆయుధం చేతికి ఇచ్చినట్టు అయింది, అటువంటి అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ చేజేతులా ఒదులుకోదు. ఆ పరిస్థితుల్లో టీడీపీ ఉన్నా అలానే ఆలోచిస్తోంది. అలాంటి రాజకీయమే ఇప్పుడు సీమాంధ్ర లో నడుస్తోంది. రాజధాని, ప్రత్యేక హోదా ఈ రెండూ ఒకరకంగా టీడీపీకి ప్రజల్లో సానుభూతి కలిగించే అంశాలే. కానీ కొన్ని స్వయంగా చేసుకున్న పనులే ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి.
నేడు బాబు పాలన చూస్తుంటే జాలి వేస్తోంది....
రెండేళ్ళ క్రితం ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటి నుంచి ఆయన కాలికి బలపం కట్టుకుని రాష్ట్రంలో అన్ని జిల్లాలను అనేక పర్యాయాలు చుట్టబెడుతూ వస్తున్నారు. ఇక విదేశీ పర్యటనలు సరేసరి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా సంబంధిత అధికారులు చేరుకునేలోగానే ఆయన అక్కడ తయారు, నేను నిద్రపోను మిముల్ని నిద్రపోనివ్వను అనే ఈ తరహా ప్రవృత్తి జనంలో, ఇలాంటి ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు అనే సంతృప్తిని కలిగిస్తే.. కింద పనిచేసే ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. అలా అలు పెరుగకుండా తిరిగే మనిషిని ఓ పట్టాన పట్టుకోవడం కష్టం. అలాంటి మనిషి నేడు చేస్తున్న పాలన చూస్తుంటే బాధతో కూడిన జాలి వేస్తోంది. చేతల మనిషి అనిపించుకున్న వ్యక్తి మాటల మనిషిగా మిగిలిపోతున్నారేమో అని కూడా అనిపిస్తే తప్పుపట్టాల్సిన పనిలేదు. రెండేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే చేసిన పనులకన్నా చేయాల్సినవే ఎక్కువ కనబడుతున్నాయి. చేసినవి కూడా అరకోరే అనే విమర్శలు వినబడుతున్నాయి.
ఎన్టీఆర్ మరణం తో చంద్రబాబు కు ఎదురులేకుండా పోయింది...
ఆయనలోని సమర్ధుడికి సవాల్ విసురుతున్నాయి. ఆ సమర్ధతను చూసి పట్టం కట్టిన వారిలో అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. సమస్యలను అవకాశాలుగా మార్చుకుని విజయ పధంలో సాగిపోతుంటానని అప్పటి చంద్రబాబును ఇప్పటి చంద్రబాబు తో పోల్చి చూసుకుంటే ఎంతో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అయితే గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆర్ధిక శాఖ మంత్రి గా పనిచేశారు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతం ఎన్టీఆర్ కు ఉన్న పేరు తెలుగు రాష్ట్రాల్లో ఇంత అంతా కాదు. రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ ఆకస్మిక మరణం తో చంద్రబాబుకు రాజకీయంగా ఎదురు లేకుండా పోయింది. దానితో పాలనపై దృష్టి పెట్టి వినూత్న పథకాలతో ముందుకు సాగారు. పార్టీకి, ప్రభుత్వానికీ ఆయనే బాస్ కావడం, అనుకున్నవి అనుకున్నట్లు చేయగల అవకాశం వచ్చాయి. దానికి తోడు అప్పుడే రంగ ప్రవేశం చేసిన ఆర్థిక సంస్కరణలను, ఇన్పర్మేషన్ టెక్నాలజీని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆదర్శ ముఖ్యమంత్రి అనే పేరు సంపాదించుకున్నారు.
టీడీపీ వైకాపా మధ్య ఓట్ల శాతం అతి తక్కువే...
ఇక అప్పడప్పుడే కళ్లు తెరుస్తున్న ప్రైవేట్ మీడియా ప్రభావం కూడా ఆయనకు కలిసి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్కలు తీసుకున్నా, ఏ లెక్కలు చూసినా ఇప్పటి నేతల్లో ఆయనే సీనియర్ నాయకుడు. ఇంత అనుభవం ఉండి కూడా ప్రజానీకానికి సంబంధించిన కొన్ని అంశాలను, ముఖ్యంగా రాష్ట్ర రాజధాని వంటి అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయాలపై, కేవలం రాజకీయ కోణం నుంచే పరిశీలించి, ఆలోచించి, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. 2014 ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో చంద్రబాబు పలు పర్యాయాలు చెప్పారు. తాను గతంలో కంటే ఇప్పుడు మార్పు చూస్తారని ,నిజంగా నేను మారను అని తెలిపారు. వాస్తవానికి నిజంగా ఆయన మారారు. మారిన రాజకీయ పరిస్థితుల ఆయన్ని అలా మార్చి ఉంటాయి. గత ఎన్నికల్లో చేజారినది అనుకున్న అధికారం చేతికి వచ్చింది. చేజార్చుకున్న జగన్ పార్టీకి, చేజిక్కించుకున్న టీడీపీకి నడుమ ఓట్ల శాతం అతి తక్కువ అని తెలియని మనిషేమీ కాదు చంద్రబాబు. ఈ కారణమే బహుశా ఆయనలోని రాజకీయ నాయకుడ్ని మేలుకొలిపి ఉంటుంది.
చంద్రబాబు సరిదిద్దుకోవడానికి మరో మూడేళ్ళు ఉంది...
కానీ గతంలో చంద్రబాబు ఒక పరిణితి చెందిన రాజకీయ వేత్తను చూసిన వారికి మాత్రం అలా అనిపించడం లేదు. చేస్తున్నాం. చేస్తాం అనే దగ్గరే ఆగిపోతున్నారు. రెండేళ్లుగా చేసి చూపించింది ఏమీలేదు. రాజకీయం తప్ప అని నిజాయితీగా చెప్పే వాళ్ళలో కూడా ప్రతిపక్షాల నీడలు కనబడితే ఇక చేసేదేమీ లేదు. చెప్పేదేమీ ఉండదు. రెండేళ్ళే గడిచాయి. ఇంకా మూడేళ్ళు ఉంది. దిద్దుకోవడానికీ, సరిదిద్దుకోవడానికీ సరిపడిన వ్యవధానం మిగిలే ఉంది. ఏంచేసినా అది చంద్రబాబు చేతుల్లోనే ఉంది. ఇక ముందు జరిగే ఫలితాలకూ, పర్యవసానాలకూ ఆయనే కర్త. మరి రానున్న మూడేళ్ళ లో ఎలాంటి మార్పును తీసుకువస్తాడో చూడాలి మరి.