గోల్కొండ కోటలో నేటి నుంచి జరగనున్న బోనాల ఉత్సవాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బోనాలు జరిగే గురు, ఆదివారాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించనున్నారు. కోటతో పాటు తొట్టెల వూరేగింపు కొనసాగే బంజారాదర్వాజా, ఫతేదర్వాజా నుంచి కోటకు దారితీసే ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కూడళ్ల వద్ద పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు, అశ్వికదళంతో పాటు పలువురు ఐపీఎస్లు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్న హైదరాబాద్ గగనతలంపై నెల రోజులపాటు నిషేధాజ్ఞలు కొనసాగనున్నాయి.
పారా గ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్లతోపాటు ప్రభుత్వపరంగా ఉపయోగించే అనమ్యాన్డ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ), అనమ్యాన్డ ఏరియల్ సర్వే (యూఏఎస్)లపై నెల రోజులపాటు పోలీసులు నిషేధం విధించారు. జాన్, బోనాల ప్రారంభం ఒకేరోజు రావడంతోపాటు నెల రోజులపాటు బోనాల పండుగ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్లో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. అత్యంత సున్నితమైన గోల్కొండ ప్రాంతంలో బోనాలు జరుగుతుండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఆలయాలతోపాటు రంజాన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. మక్కా మసీదు, మీరాలంమండి, టూంబ్స్తోపాటు అన్ని మసీదుల వద్ద బందోబస్తు కట్టుదిట్టం చేశారు. గోల్కొండ బోనాల ఊరేగింపు జరిగే మార్గాలు, రంజాన ప్రార్థనలు జరిగే ప్రదేశాల్లో విసృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సిబ్బంది సెలవులు రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రార్థన మందిరాలకు దూరంగా వాహనాల పార్కింగ్ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా మతపెద్దలతో పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. పీస్, మైత్రీ కమిటీ సభ్యులతో సమావేశమై భద్రతలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చర్యలు చేపట్టారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు హైదరాబాద్లో ఐఎస్ ఏర్పాటు చేసిన డేంజర్ మాడ్యూల్ తీవ్రతను గుర్తించిన కేంద్రం.. ఐఎస్ సానుభూతిపరుల విషయంలో మూలాల్లోకి వెళ్లి వివరాలు రాబట్టాలని ఎన్ఐఏకు సూచించింది.